
కోర్టు సముదాయ నిర్మాణానికి చర్యలు
వనపర్తి టౌన్: జిల్లాలో కోర్టు సముదాయ భవన నిర్మాణానికి సత్వర చర్యలు చేపట్టాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత కలెక్టర్ ఆదర్శ్ సురభిని కోరారు. బుధవారం ఉదయం జిల్లా న్యాయస్థానం కాంప్లెక్స్లో కొత్తగా నిర్మించిన మూడు కార్ పార్కింగ్ షెడ్లు, రెండో అదనపు కోర్టు హాల్, వైద్య చికిత్స కేంద్రాన్ని కలెక్టర్, బార్ కౌన్సిల్ అధ్యక్షుడు డి.కిరణ్కుమార్, ఇతర ప్రధాన న్యాయమూర్తులతో కలిసి ఆమె ప్రారంభించి మాట్లాడారు. కోర్టు ప్రాంగణంలో వైద్య కేంద్రం ఉండటం చాలా అవసరమని, కక్షిదారులు, న్యాయవాదులు, సిబ్బందికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. అడిగిన వెంటనే వైద్య చికిత్స కేంద్రం, కారు పార్కింగ్ షెడ్లు నిర్మాణానికి నిధులు మంజూరు చేసినందుకు కలెక్టర్కు కృతజ్ఞతలు చెప్పారు. అదేవిధంగా బార్ కౌన్సిల్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి న్యాయస్థానంలోని ఒక్కో సమస్యను పరిష్కరిస్తున్నందుకు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, వారి బృందానికి అభినందనలు తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఆరోగ్యాన్ని సంరక్షించుకోడానికి ముందస్తు వైద్య పరీక్షలు ఎంతో అవసరమని, సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోవడంతో రోగాల బారిన పడకుండా ఉండవచ్చన్నారు. కారు పార్కింగ్ ప్రాంతంలో సీసీ నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరు చేయాలని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కిరణ్కుమార్ కలెక్టర్ను కోరారు. కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి రజని, న్యాయమూర్తులు కళార్చన, కవిత, శ్రీలత, బార్ కౌన్సిల్ సభ్యులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.