
రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి
ఆత్మకూర్: టీయూసీఐ రాష్ట్ర మహాసభలు ఈ నెల 21, 22 తేదీల్లో నిజామాబాద్లో జరుగుతాయని.. కార్మికులు అధికసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సంఘం జిల్లా కార్యదర్శి ప్రసాద్, మండల అధ్యక్షుడు చెన్నయ్య పిలుపునిచ్చారు. బుధవారం పట్టణంలో కార్మికులతో కలిసి మహాసభల వాల్పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. ఇఫ్టూను టీయూసీఐలో విలీనం చేసిన అనంతరం జిల్లాల వారీగా సభలు నిర్వహిస్తున్నామని.. కార్మికుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని వివరించారు. కార్యక్రమంలో నాయకులు జీవరత్నం, నాగేష్, రాజు, వెంకటన్న, మంజుల, సునీత, సువర్ణ తదితరులు పాల్గొన్నారు.
సివిల్స్ అభ్యర్థులకు
ఉచిత శిక్షణ
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): బంజారాహిల్స్లోని ఎస్సీ స్టడీ సర్కిల్లో శిక్షణ పొందేందుకు సివిల్స్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉప సంచాలకురాలు సునీత, ఎస్సీ స్టడీ సర్కిల్ జిల్లా డైరెక్టర్ శ్రీనివాస్ బుధవారం ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్, బంజారాహిల్స్, హైదరాబాద్లో 2025–26 సంవత్సరానికి నిర్వహించే సివిల్స్ ప్రిలిమ్స్, మెయిన్స్ ఉచిత శిక్షణ, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులు వెబ్సైట్ htt p://tsstudycircle.co.in లో బుధవారం నుంచి జూలై 7వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తులను చేసుకోవాలని కోరారు. శిక్షణకు రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల నుంచి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారని తెలిపారు. అభ్యర్థులు జనరల్/ ప్రొఫెషనల్ డిగ్రీలో ఉత్తీర్ణులై, తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.3 లక్షలకు మించరాదని, ఎలాంటి ఉద్యోగం చేయని వారు అర్హులని తెలిపారు. ప్రవేశ పరీక్ష హైదరాబాద్, ఎంపిక చేయబడిన ఇతర సెంటర్లలో జూలై 13న ఉంటుందని, పరీక్షలో అభ్యర్థులకు వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పద్ధతిలో ఎస్సీలకు 75 శాతం, ఎస్టీలకు 10 శాతం, బీసీలకు 15 శాతం ప్రకారం ఎంపిక చేస్తారని, అమ్మాయిలకు 33.33 శాతం సీట్లు కేటాయిస్తారని తెలిపారు. మరిన్ని వివరాలకు ల్యాండ్లైన్ నంబర్ 040–23546552, సెల్నంబర్ 81216 26423 సంప్రదించాలని సూచించారు.
రేపు పాలమూరుకు
మంత్రి పొన్నం రాక
పాలమూరు: మహబూబ్నగర్లో శుక్రవారంరాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించనున్నారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న ఆర్టీఏ, ఆర్టీసీ, బీసీ వెల్ఫేర్ శాఖల అధికారులతో కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అధికార యంత్రాంగంతో పాటు ఆయా జిల్లాల కలెక్టర్లు సైతం సమావేశానికి హాజరుకానున్నారు. ఈ మేరకు ఆయా శాఖల అధికారులు సమీక్ష సమావేశానికి సన్నద్ధం అవుతున్నారు.