
రోడ్డు విస్తరణ కొలతలు అడ్డుకున్న వ్యాపారులు
వనపర్తి టౌన్: జిల్లాకేంద్రంలోని కర్నూలు రోడ్డును విస్తరించేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గురువారం అధికారులు పాలిటెక్నిక్ రోడ్డుకు రెండు వైపుల ఎంత మేరకు విస్తరించాలో మార్కింగ్ ప్రక్రియ చేపట్టారు. ఈ మార్కింగ్ ప్రక్రియను చేపట్టేందుకు మున్సిపల్, రెవెన్యూ, ఆర్అండ్బీ అధికారులతో కలిపి మొత్తం 10 మంది కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఇప్పటికే పానగల్ రోడ్డును రెండు వైపులా సెంటర్ పాయింట్ నుంచి 35 అడుగుల మేర విస్తరించేందుకు సర్వే పూర్తి చేశామని వెల్లడించారు. కర్నూలు రోడ్డులో ప్రస్తుతం ఉన్న కొత్తకోట రోడ్డు మధ్య నుంచి 45 అడుగులు ఉండటంతో అదే రీతిలో పాలిటెక్నిక్ రోడ్డు విస్తరణకు మార్కింగ్ చేసేందుకు గురువారం చర్యలు చేపట్టారు. అయితే సుమారు 30 దుకాణాలకు మార్కింగ్ ఇచ్చిన వెంటనే మిగతా దుకాణాలకు మార్కింగ్ ఇవ్వకుండా స్థానిక వ్యాపారులు అడ్డుకోవడంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఎలా మార్కింగ్ చేస్తారని కొందరు వ్యాపారులు అధికారులను అడ్డుకున్నారు. ప్రభుత్వ స్థలాల వైపు, రాజాగారు వదిలిన లాన్ మార్గంలో కొందరు దుకాణాలు నిర్మించారని, వాటిని తొలగించి అప్పుడు రోడ్ల విస్తరణకు మార్కింగ్ చేయాలని పట్టుబట్టారు. ప్రస్తుతం ఉన్న రోడ్డును సెంటర్ పాయింట్గా తీసుకొని విస్తరించడం సరికాదన్నారు. ఏళ్ల తరబడి ఉన్న ఆస్తులకు నష్టపరిహారం ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఈ మేరకు అక్కడి నుంచే మున్సిపల్ కమిషనర్తో వ్యాపారులు ఫోన్లో మాట్లాడారు. దీంతో స్పందించిన మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు ఈ విషయమై శుక్రవారం సమావేశం నిర్వహిద్దామని చెప్పడంతో వ్యాపారులు అంగీకరించారు. దీంతో అధికారులు మార్కింగ్ ఇచ్చే ప్రక్రియను నిలిపివేసి వెనుదిరిగారు.