
‘భూ భారతి’ చారిత్రాత్మకం
వనపర్తి రూరల్: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి చట్టం చారిత్రాత్మకమని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. బుధవారం పెబ్బేరు మండలం కంచిరావుపల్లి రైతువేదిక, శ్రీరంగాపురం కామన్ కమ్యూనిటీ భవనంలో భూ భారతి–2025 చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయనతో పాటు కలెక్టర్ ఆదర్శ్ సురభి, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ సుబ్రమణ్యం, మండల ప్రత్యేక అధికారి సుధారాణి ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వం 18 లక్షల ఎకరాల భూమిని మాయం చేసి తీసుకొచ్చిన మాయదారి ధరణిని ఎన్నికల హామీలో భాగంగా బంగాళాఖాతంలో వేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి భూ వివాదాల పరిష్కారానికి ఎంతగానో దోహదపడుతుందన్నారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. భూమి, భూ చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, ఏదైనా కొత్త చట్టం వచ్చినప్పుడు అందులోని ప్రతి అంశాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ప్రజలకు ఉంటుందని తెలిపారు. ధరణి చట్టంలో ఉన్న సమస్యల పరిష్కారానికి మేధావులతో చర్చించి పటిష్ట భూ భారతి తీసుకొచ్చినట్లు చెప్పారు. భూ రిజిస్ట్రేషన్ సమయంలో క్షేత్రస్థాయిలో సర్వేచేసి నాలుగు దిక్కుల హద్దులు నిర్ణయించుకొని పట్టాదారు పాసు పుస్తకంలో భూమి వివరాలతో పాటు పటం ముద్రిస్తారని.. దీంతో భవిష్యత్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండదని వివరించారు. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, సక్సెషన్ సమయంలో తప్పు జరిగినట్లు భావిస్తే ఆర్డీఓకు అప్పిల్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఆర్డీఓస్థాయిలో కూడా తప్పు జరిగితే కలెక్టర్కు అప్పీల్ చేసుకోవచ్చని తెలిపారు. అనంతరం శ్రీరంగాపురం మండల కేంద్రంలో పశువుల వెంకటయ్య, మంజుల ఇంట్లో కలెక్టర్, ఎమ్మెల్యే ప్రభుత్వం సరఫరా చేసిన సన్నబియ్యంతో వంటిన భోజనం చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్లు లక్ష్మి, మురళిగౌడ్, మార్కెట్ చైర్మన్ ప్రమోదిని, వైస్ చైర్మన్ విజయవర్ధన్రెడ్డి, ఎంపీడీఓలు రవీందర్, రవినారాయణ, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.