పుర సిబ్బంది పనితీరు భేష్‌ | - | Sakshi
Sakshi News home page

పుర సిబ్బంది పనితీరు భేష్‌

Apr 10 2025 12:45 AM | Updated on Apr 10 2025 12:45 AM

పుర సిబ్బంది పనితీరు భేష్‌

పుర సిబ్బంది పనితీరు భేష్‌

వనపర్తి: స్థానిక పుర సిబ్బంది పనితీరు అద్భుతంగా ఉందని.. గతేడాదితో పోలిస్తే ఈసారి పన్ను వసూళ్లు రూ.కోటి పెంచారని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి అభినందించారు. బుధవారం జిల్లాకేంద్రంలో పన్ను వసూళ్ల కార్యక్రమాన్ని ఆయన స్వయంగా పర్యవేక్షించి మాట్లాడారు. ఆస్తి పన్ను 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.4.43 కోట్లు వసూలు కాగా.. 2024–2025లో రూ.5.55 కోట్లు వసూలు చేశారని చెప్పారు. పుర ఆదాయం రూ.కోటి పెంచారని.. పన్ను వసూళ్లలో సిబ్బంది మెరుగైన పనితీరు కనబర్చారని తెలిపారు. ఇక కొళాయి బిల్లుల విషయానికొస్తే 2023–24లో రూ.35.63 లక్షలు వసూలు కాగా.. 2024–25లో రూ.1.27 కోట్లు వసూలయ్యాయని, మొండి బకాయిలు సైతం రాబట్టారన్నారు. ఆస్తి పన్ను, కొళాయి బిల్లులు, ట్రేడ్‌ లైసెన్స్‌, తైబజార్‌ వేలం, దుకాణాల అద్దెలు, భవన నిర్మాణ అనుమతులు మొత్తం రూ.11.29 కోట్లు జమ అయ్యాయని తెలిపారు. 2024–2025 ఆర్థిక సంవత్సరంలో 19 బృందాలు ఏర్పాటు చేసి పన్ను బకాయిదారులందరికీ నోటీసులు అందజేసినట్లు పుర కమిషనర్‌ వెంకటేశ్వర్లు వివరించారు. ఫ్లెక్సీలు, ఆటోలు, శానిటేషన్‌ వాహనాలతో ప్రచారం చేయడంతో పాటు సెల్‌ఫోన్‌లకు సందేశాలు పంపించి పన్ను చెల్లింపుదారులకు అవగాహన కల్పించామన్నారు. పన్ను వసూళ్లకు వార్డ్‌ అధికారులు, బిల్‌ కలెక్టర్లు ఉదయం నుంచి రాత్రి వరకు శ్రమించారని తెలిపారు.

పనుల్లో వేగం పెంచాలి..

జిల్లాకేంద్రంలో రహదారి విస్తరణ బకాయి పనులు వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ యాదయ్యతో కలిసి రెవెన్యూ, మున్సిపల్‌, ఆర్‌అండ్‌బీ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. పాలిటెక్నిక్‌ కళాశాల నుంచి పెబ్బేరు వైపు, పానగల్‌ రోడ్డు, హైదరాబాద్‌ రోడ్‌, మిగతా రహదారుల విస్తరణకు సంబంధించి అధికారులతో చర్చించారు. ఆయా మార్గాల్లో ఉన్న ఇళ్లకు మార్కింగ్‌ ఇవ్వకపోతే వారంలోగా పూర్తి చేయాలని సూచించారు. ఇదివరకే పరిహారం చెల్లించి ఉంటే వెంటనే పనులు ప్రారంభించాలని ఆదేశించారు. రెవెన్యూ, పుర అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. సమావేశంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, పుర కమిషనర్‌ వెంకటేశ్వర్లు, తహసీల్దార్‌ రమేశ్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ అధికారులు దేశ్యానాయక్‌, సీతారామస్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఈ ఏడాది భారీగా పెరిగిన పన్ను వసూళ్లు

కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement