ప్రణాళికతో యాసంగి ధాన్యం కొనుగోలు | - | Sakshi
Sakshi News home page

ప్రణాళికతో యాసంగి ధాన్యం కొనుగోలు

Mar 20 2025 1:00 AM | Updated on Mar 20 2025 1:00 AM

ప్రణాళికతో యాసంగి ధాన్యం కొనుగోలు

ప్రణాళికతో యాసంగి ధాన్యం కొనుగోలు

వనపర్తి: యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లుతో కలిసి వరి ధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2024–25 యాసంగికి సంబంధించి రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఏప్రిల్‌ రెండో వారంలోనే ధాన్యం కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని.. పౌరసరఫరాలు, వ్యవసాయశాఖ అధికారులు సమన్వయంతో అందుకు తగినట్టుగా ప్రణాళికలు సిద్ధం చేయాలని, కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించాలని, గన్ని బ్యాగులు, టార్పాలిన్ల కొరత లేకుండా చూసుకోవాలని సూచించారు. వేసవి నేపథ్యంలో నీడ, తాగునీటి వసతి కల్పించాలన్నారు. తాలు తొలగింపునకు ఫ్యాన్లు, రైతులు తీసుకొచ్చిన ధాన్యంలో ఏయే రోజు ఎంత తేమ శాతం ఉందనే వివరాలు రిజిస్టర్లలో నమోదు చేయాలని కోరారు. మార్చి 25లోపు తూకము, తేమ కొలిచే యంత్రాలు సిద్ధం చేయాలని మార్కెటింగ్‌ అధికారిని ఆదేశించారు. అదేవిధంగా ఏఈఓలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జ్‌లకు సన్నరకం ధాన్యాన్ని గుర్తించే విధానంపై శిక్షణ ఇవ్వాలని సూచించారు. రైస్‌మిల్లర్లు బ్యాంకు గ్యారెంటీ ఇస్తేనే ధాన్యం కేటాయింపు జరుగుతుందని, లేదంటే ఇవ్వమని స్పష్టం చేశారు. సమావేశంలో వ్యవసాయశాఖ అధికారి గోవింద్‌నాయక్‌, డీఆర్డీఓ ఉమాదేవి, పౌరసరఫరాలశాఖ అధికారి కాశీవిశ్వనాథ్‌, పౌరసరఫరాలశాఖ డీఎం జగన్‌, జిల్లా సహకారశాఖ అధికారి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.

ఇసుక రీచ్‌లను గుర్తించాలి..

స్థానిక అవసరాల మేరకు ఇసుక వినియోగించుకునేందుకు జిల్లాలో అందుబాటులో ఉన్న రీచ్‌లను గుర్తించి నివేదిక అందజేయాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ జి.వెంకటేశ్వర్లతో కలిసి నిర్వహించిన జిల్లా స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖిల్లాఘనపురం మండలం కమాలుద్దీన్‌పూర్‌, పెద్దమందడి మండలం చిలకటోనిపల్లి, మదనాపురం మండలం కరివేన, దుప్పల్లి, ఆత్మకూరు మండలం వీరరాఘవాపురం రీచ్‌లను పరిశీలించాలన్నారు. అదేవిధంగా ఫిల్టర్‌ ఇసుక దందా చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనుమతి లేకుండా ఇసుక తరలించడానికి వీలులేదని.. అవసరం ఉంటే మన ఇసుక వాహనం ద్వారానే బుక్‌ చేసుకునేలా చూడాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement