● వరుస చోరీలతో ప్రజలు బెంబేలు
● మోటారు వైర్ల చోరీతో రైతుల అవస్థలు
● ఆలయాలను సైతం వదలని దుండగులు
నెల్లిమర్ల రూరల్: మండల వ్యాప్తంగా వరుస చోరీలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గడిచిన రెండు నెలలుగా వివిధ గ్రామాల్లో పదుల సంఖ్యలో దొంగతనాలు జరిగాయి. గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి వేళల్లో గ్రామాల్లో తిరుగుతూ నానా హడావిడి సృష్టిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇటీవల కాలంలో ఒమ్మి గ్రామంలోని గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో రెక్కీ నిర్వహించి రెండు ద్విచక్రవాహనాలను ఎత్తుకుపోయారు. వారు చోరీ చేసిన విధానం సీసీ కెమోరాల్లో కూడా నమోదైంది. ఆ సంఘటన మరువక ముందే తమ్మాపురం, ఆల్తిపాలెం, ఎంబేరేయగుళ్లు గ్రామాల్లో పంటపొలాల్లో ఉన్న సుమారు 10 మంది రైతులకు చెందిన మోటార్ల వైర్లు అపహరించుకుపోయారు. అసలే ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. రైతులు తమ పంటపొలాలకు నీటి తడులు అందించేందుకు మోటార్లపైనే ఆధారపడుతున్నారు. మోటారు వైర్లు దొంగలించడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే మొయిదలో ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో కూడా గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. హుండీలోని నగదు, వెండి వస్తువులు పట్టుకుపోయారని అర్చకులు, భక్తులు తెలిపారు. అలాగే సతివాడలోని రైతుసేవా కేంద్రంలో కూడా రెండు రోజుల కిందట చోరీ జరిగింది. ఒక ప్రింటర్తో పాటు టీవీని ఎత్తుకుపోయినట్లు వ్యవసాయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆయా సంఘటనలపై విచారణ కొనసాగిస్తున్నారు. సతివాడలో ఉన్న పలు రెస్టారెంట్లు అర్ధరాత్రి వరకు నిర్వహిస్తుండడంతో, కొంతమంది వ్యక్తులు అక్కడే మద్యం సేవిస్తూ మత్తులో సతివాడ, పరిసర ప్రాంతాల్లో చిరు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. రాత్రి వేళల్లో మరింత నిఘా పెంచాలని కోరుతున్నారు.


