● 23 తులాల బంగారం, 12 కేజీల
వెండిని దోచుకుపోయిన దొంగలు
● లబోదిబో మంటున్న వైద్యుడు సుబ్బారావు
కొత్తవలస: మండల కేంద్రంలోని సబ్బవరం రోడ్డులో నివసిస్తున్న తెన్నేటి సుబ్బారావు ఇంటిలో దొంగలు పడ్డారు. బంగారు ఆభరణాలు, వెండిని దోచుకుపోయారు. బాధితులు, సీఐ సీహెచ్ షణ్ముకరావు తెలిపిన వివరాల ప్రకారం.. డాక్టర్ సుబ్బారావు హైదరాబాద్లో నివసిస్తున్న భార్యను తీసుకువచ్చేందుకు రెండు రోజుల కిందట వెళ్లారు. శనివారం రాత్రి ఇంటి వెనుకభాగంలోని గోడ, కిటికీలను తొలిగించి దుండగులు ఇంట్లోకి ప్రవేశించారు. బీరువా, మంచం కింద దాచిపెట్టిన 23 తులాల బంగారం, 12 కేజీల వెండిని దోచుకుపోయారు. సోమవారం ఉదయం సుబ్బారావు తన భార్యతో కలిసి వచ్చి ఇంటిలో చూడగా సామాన్లు చిందర వందరగా పడి ఉన్నాయి. చోరీ జరిగినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ షణ్ముకరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. విజయనగరం క్లూస్ టీం వేలిముద్రలను సేకరించింది. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
తొలిరోజు పరీక్ష ప్రశాంతం
విజయనగరం అర్బన్: జిల్లాలో తొలిరోజు సోమవారం నిర్వహించిన పదో తరగతి తెలుగు పరీక్ష ప్రశాంతంగా జరిగింది. జిల్లా వ్యాప్తంగా 119 పరీక్ష కేంద్రాల్లో 23,015 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 75 మంది గైర్హాజరయ్యారు. పట్టణంలోని పలు పరీక్ష కేంద్రాలను కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి సోమవారం పరిశీలించారు. సౌకర్యాలపై ఆరా తీశారు. ప్రశాంత వాతావరణలో పరీక్షలు రాసేలా నిరంతరం పర్యవేక్షించాలని పర్యవేక్షకులకు సూచించారు.


