
దర్జాగా చెరువుల కబ్జా !
బొబ్బిలి రూరల్:
రైతులకు సాగునీటినిచ్చే చెరువులు అక్రమార్కుల చెరలో చిక్కిపోతున్నాయి. ‘అధికార’బలం ముందు కనుమరుగవుతున్నాయి. దీనికి బొబ్బిలి మండలం పిరిడి గ్రామంలో చెరువుల దురాక్రమణే నిలువెత్తు నిదర్శనం. పదేళ్లలో ఏడెకరాల విస్తీర్ణంలోని చెరువు గర్భాలు ఆక్రమణకు గురై నివాస ప్రాంతాలుగా మారాయి. తాజాగా పోలవాని చెరువు నుంచి వచ్చిన నీటిని నిల్వ ఉంచి పంట భూమలకు సాగునీటిని అందించే సన్యాసినాయుడు కోనేరు కబ్జా అవుతోంది. సర్వే నంబర్ 83లో సుమారు ఎకరం విస్తీర్ణం ఉన్న సన్యాసినాయుడు చెరువును ఆక్రమించేందుకు పక్కా ప్లాన్తో మట్టితో ఓ పక్క నుంచి పూడ్చివేస్తున్నారు. ఇప్పటికే నాలుగు ఎకరాల విస్తీర్ణమున్న రాజానాయుగారి కోనేరు, మూడెకరాల విస్తీర్ణంలోని పూనుగుల గుమ్మి పూర్తిగా కబ్జాదారుల కబందహస్తాల్లోకి చేరిపోయాయని, ఇప్పుడు ఆ కోవలోకి సన్యాసినాయుడు చెరువు చేరనుందని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. చెరువును పూడ్చివేస్తే సాగునీరు ఎలా అందుతుందని రైతులు ప్రశ్నిస్తున్నా స్పందించేవారే కరువయ్యారు. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు తెలిసే కబ్జాలు సాగుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆర్ఐ కొల్లి రామకుమార్ వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా సన్యాసినాయుడు చెరువు పూడ్చివేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, అడ్డుకున్నామని తెలిపారు. గ్రామంలో రామాలయం కూల్చివేయగా ఆ మట్టిని చెరువులోనే వేయాలన్న పెద్దలనిర్ణయం మేరకు అక్కడ వేస్తున్నట్లు గ్రామస్తులు కొందరు తెలిపారన్నారు.

దర్జాగా చెరువుల కబ్జా !