
అందరికీ తల్లికి వందనం ఇచ్చాం
నెల్లిమర్ల: ప్రతి విద్యార్థి చదువుకోవాలనే లక్ష్యంతో తల్లికి వందనం పథకం అందరికీ మంజూరు చేశామని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి ఎస్.సవిత అన్నారు. నెల్లిమర్ల పట్టణంలో ఉన్న మహాత్మ జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ బాలికల గురుకుల జూనియర్ కళాశాల, పాఠశాలను గురువారం ఆమె స్థానిక ఎమ్మెల్యే లోకం నాగమాధవితో కలిసి సందర్శించారు. సిబ్బంది, విద్యార్థులతో వేర్వేరుగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జీవనానికి విద్యార్థులందరూ ప్రతిరోజూ యోగా సాధనచేయాలని సూచించారు. ఉపాధ్యాయులు, అధ్యాపకులు విద్యార్థులకు దగ్గరగా ఉంటూ అనుకూలమైన బోధన అందించాలన్నారు. ఈ సందర్భంగా కళాశాలకు అదనపు భవనాలు కావాలని, గురుకులానికి వచ్చే మట్టి రోడ్డును సీసీ రోడ్డుగా అభివృద్ధిచేయాలని ప్రిన్సిపాల్ కె.బి.బి.రావు మంత్రికి విన్నవించారు. కార్యక్రమంలో ఆర్డీఓ డీటీ భవ్యశ్రీ, ఎంఈఓ సూర్యనారాయణమూర్తి, నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు సరోజిని, తదితరులు పాల్గొన్నారు.
మంత్రి కార్యక్రమానికి టీడీపీ నేతలు దూరం
నెల్లిమర్ల పట్టణంలోని బీసీ గురుకులం సందర్శనకు విచ్చేసిన మంత్రి ఎస్.సవిత కార్యక్రమాన్ని టీడీపీ నేతలు బాయ్కాట్ చేశారు. నెల్లిమర్ల నియోజకవర్గానికి చెందిన నాయకులు ఎవరూ కార్యక్రమానికి హాజరుకాలేదు. ఎమ్మెల్యే లోకం నాగమాధవి, బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి బూర్లె శ్రీధర్, జనసేన, బీజెపీ నాయకులు మాత్రమే పాల్గొన్నారు. గత మూడు నెలలుగా ప్రభుత్వ కార్యక్రమాలకు నెల్లిమర్ల టీడీపీ నాయకులు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. దీనిపై బీజేపీ, జనసేన నాయకులు గుసగుసలాడారు.
రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి ఎస్.సవిత