
గొంతు కోసి నడిరోడ్డుపై వదిలేసి
రణస్థలం: మండలంలోని పైడి భీమవరం నడిబొడ్డున శనివారం సాయంత్రం జరిగిన వివాహిత దారుణ హత్య కలకలం రేపింది. స్థానికులు, జేఆర్ పురం పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. శనివారం సాయంత్రం బోనం పేరంటాలు గుడి వద్ద గుర్తు తెలియని వ్యక్తి అవాల భవాని(25) అనే వివాహితను దారుణంగా చాకుతో గొంతు కోసి వెళ్లిపోయాడు. సంఘటన స్థలంలోనే చాకును నీళ్లతో కడిగేసి అక్కడే పడేశాడు. కొన ఉపిరితో ఉన్న భవాని అక్కడకు కొద్ది దూరంలో వైఎస్సార్ విగ్రహం వెనుక బస్టాప్ దగ్గరలో చెరువు గట్టు వరకు వచ్చి అక్కడే పడిపోయి మృతి చెందింది. ఆమె భర్త వెంకట సత్యం లారీ డ్రైవర్గా పనికి వెళుతుంటాడు. ప్రస్తుతం ఒడిశా రాష్ట్రంలోని బరంపురం దగ్గరలో ఉన్నట్లు కుటుంబ సభ్యులకు తెలిపారు. భవాని స్వగ్రామం విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలోని పెద్ద పతివాడ గ్రామం. నాలుగేళ్ల క్రితం పైడిభీమవరం పంచాయతీలోని గొల్లపేట గ్రామానికి చెందిన వెంకట సత్యంతో వివాహమైంది. ఈ దంపతులకు రెండున్నరేళ్ల కుమార్తె కూడా ఉంది. వెంకట సత్యం లారీ డ్రైవర్గా పనిచేస్తుండగా.. భవాని పైడిభీమవరంలోని ఒక హోటల్ పని చేస్తోంది. శనివారం మధ్యా హ్నం 3.30 గంటల సమయంలో హోటల్ నుంచి వెళ్లిపోయిందని యజమాని చెబుతున్నాడు. ఆ తర్వాత ఆమె సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో బస్టాప్ వద్ద విగతజీవిగా కనిపించింది. స్థానికులు సమాచారం అందించడంతో జేఆర్ పురం సీఐ అవతారం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. 3.30 నుంచి ఆరు గంటల మధ్యలో ఆమె ఎటు వెళ్లిందనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. హోటల్లో పని చేసిన వ్యక్తుల ప్రమేయంపై కూడా విచారణ చేస్తున్నారు. మృతదేహాన్ని శవపంచనామా కోసం శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. హత్యగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు జేఆర్ పురం ఎస్ఐ ఎస్.చిరంజీవి తెలిపారు.
పైడిభీమవరంలోని బోనం
పేరంటాలు గుడి సమీప ప్రాంతం. సాయంత్రం 6 గంటల సమయం. అంతా రద్దీగా ఉంది. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. అంతలో ఒకామె నడుచుకుంటూ వచ్చి పడిపోయింది. స్థానికులు గమనించి వెళ్లి చూసేలోపే అప్పటికే తెగిన ఆమె గొంతు నుంచి రక్తం ధార కట్టి ఆ ప్రాంతమంతా ఎర్రగా మారిపోయింది. పైడి భీమవరం నడిబొడ్డున జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పాతికేళ్ల వివాహితను అత్యంత కర్కశంగా గొంతుకోసి చంపేశారు.
పైడిభీమవరం నడిబొడ్డున ఘటన
వివాహిత దారుణ హత్య

గొంతు కోసి నడిరోడ్డుపై వదిలేసి