కొత్త ఆలోచనలు.. సరికొత్త ఆవిష్కరణలు..
తాను తయారు చేసిన వాహనంపై
కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్తో గౌతమ్ (ఫైల్)
● 15 గంటల్లో బైక్ తయారీ చేసిన గౌతమ్
● బ్యాటరీలతో సరికొత్త వాహనాలు డిజైన్
● స్టీరింగ్ లేని కారు, వ్యవసాయానికి
ఉపయోగపడే స్ప్రేయర్లు కూడా..
పార్వతీపురం టౌన్:
పట్టణానికి చెందిన గెంబలి గౌతమ్ విశాఖపట్నం గీతం యూనివర్సిటీలో డేటా సైన్స్ విద్యను పూర్తి చేశాడు. చూసే ప్రతి కళా ఒడిసి పట్టడమంటే చిన్నప్పటి నుంచి సరదా. అదే అలవాటుగా మారి.. నూతన ఆవిష్కరణలకు బీజం పోసింది. మైక్రో ఆర్ట్ నుంచి వినూత్న వాహనాల తయారీ వరకూ కొత్త ఆలోచనలతో సాగిపోతున్నాడు. రోజురోజుకూ పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో బ్యాటరీతో నడిచే వాహనాలను సొంతంగా తయారు చేసి అందరి మన్ననలను పొందుతున్నాడు. కళాత్మక ఆలోచన నుంచి రూపుదిద్దుకున్న ఆవిష్కరణలను చూసి ఔరా అని అనాల్సిందే. అతి తక్కువ ఖర్చుతో నడిచే స్కూటర్ను చూస్తే వావ్ అనాల్సిందే. విభిన్నమైన ఆలోచనలతో ముందుకు సాగుతున్న గౌతమ్ ఆలోచనలను ఒక్కసారి పరిశీలిస్తే..
దివ్యాంగులకు స్టీరింగ్ లేని కారు..
దివ్యాంగుల కోసం దేశంలోనే మొట్టమొదటి స్టీరింగ్ లెస్ కారుని తయారు చేసి దాన్ని రోడ్లపై నడుపుతూ గౌతమ్ అబ్బురపరిచాడు. ఈయన రూపొందించిన కారుకి స్టీరింగ్ ఉండదు. కేవలం రూ.32 వేల ఖర్చుతో డిజైన్ చేసిన కారులో 350 వోల్టుల సామర్థ్యం కలిగిన 2 మోటార్లు, లిథియం బ్యాటరీ, కొంత ఐరన్ వినియోగించాడు. సోలార్తో పాటు బ్యాటరీతో నడిచేలా కారుని తయారు చేశాడు. కాళ్లు వద్ద ఏర్పాటు చేసిన సెన్సార్ల ద్వారా ఆపరేట్ అవుతుంది. చేతులు లేని విభిన్న ప్రతిభావంతుల్ని దృష్టిలో పెట్టుకొని ఈ డిజైన్ రూపొందించారు. జీపీఆర్ఎస్ సిస్టమ్, బ్లూ టూత్ వంటి సదుపాయాలూ ఈ కారు సొంతం. దీనికి లైసెన్స్తో పనిలేదు. గతంలో అంతర్జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఈ కారుని చూసిన జపాన్ బృందం నుంచి గౌతమ్ ప్రత్యేక ప్రశంసలు అందుకున్నారు. విశాఖపట్నంలోని ఇద్దరు దివ్యాంగులకు రెండు కార్లు ప్రత్యేకంగా తయారు చేసి వారికి అందజేశారు.
ఏ ఆలోచన వచ్చినా..
ఏ ఆలోచన వచ్చినా వెంటనే అమలు చేసేందుకు ప్రయత్నిస్తుంటాను. ఇప్పటివరకూ స్టీరింగ్ లెస్ కారుతో పాటు రెయిన్ బో స్కూటర్, రెండింతల మైలేజీ వచ్చేలా బైక్ డిజైన్లో మార్పులు చేశాను. సరికొత్త బైక్ తయారీకి ప్రయత్నిస్తున్నాను. రెయిన్ బో స్కూటర్ చాలా మందికి నచ్చడంతో ఇప్పటికే కొంతమందికి డిజైన్చేసి అందజేశాను. చిన్నప్పటినుంచి సరికొత్తగా ఆలోచించడం, ఏదో ఒకటి చేయాలన్న తపనతో అనేక విషయాలను నేర్చుకోవడం మొదలు పెట్టాను.
– జి.గౌతమ్, యువకుడు, పార్వతీపురం.
ఈ–బైక్ తయారీలో
తన స్నేహితుడైన వెల్డర్ జానకి సహాయంతో కేవలం 15 గంటల్లో ఈ–బైక్ రూపొందించాడు. దానిని రెండు గంటలపాటు చార్జింగ్ చేస్తే 50 నుంచి 60 కిలోమీటర్ల స్పీడ్తో 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. వాహనం తయారీకి పాత ఇనుప సామగ్రి, ఎలక్ట్రికల్ వస్తువులు, స్కూటీ టైర్లు, బీఎల్డీసీ మోటార్, లిథియం బ్యాటరీని వినియోగించాడు. యాక్సిలేటర్, ఆటో గేర్ సిస్టమ్, హ్యాండ్ బ్రేక్ ఉపయెగించాడు. రాత్రి కూడా సునాయాయసంగా ప్రయాణించేందుకు వీలుగా బైక్కు ఫ్లడ్లైట్ అమర్చాడు. పట్టణానికిచెందిన ఓ వ్యాపారి ఎలక్ట్రికల్ పరికరాలు ఉచితంగా ఇవ్వడంతో తన ప్రయోగం వేగంగా 15 గంటలో పూర్తి చేయడం విశేషం.
కొత్త ఆవిష్కరణలు..
పెట్రోల్ ధరలు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. దీనివల్ల సాధారణ ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వారి సమస్యలకు పరిష్కారాన్ని చూపించేలా సరికొత్త డివైజ్లు రూపొందించాడు గౌతమ్. చైనాకు చెందిన హజ్ మోటారు వినియోగించి, బైక్లో కొన్ని మార్పులను చేసి లీటర్ పెట్రోల్ గతంలో ఇచ్చిన మైలేజ్ కంటే డబుల్ వచ్చేలా చేశాడు. ఇప్పటికే ప్రాక్టికల్గా పరీక్షించిన గౌతమ్ వాహనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చాడు.
తక్కువ ఖర్చుతోనే స్కూటర్..
ఇంట్లో ఉండే పాత ఇనుప సామగ్రిని వినియోగించి కేవలం రూ.13 వేల ఖర్చుతో రెయిన్ బో స్కూటర్ను గౌతమ్ రూపొందించాడు. లిథియం బ్యాటరీ, మూలకు చేరిన కొన్ని వాహనాల పరికరాలను వినియోగించి దీనిని తయారు చేశాడు. తన మామయ్య కోరిక మేరకు దీనిని తీర్చిదిద్దానని, అయితే ఎంతోమందికి నచ్చడంతో ఈ తరహా బైక్స్ తయారు చేయాలంటూ ఆర్డర్లు వస్తున్నాయని గౌతమ్ చెబుతున్నాడు.
సత్కారం..
జిల్లాకు చెందిన గౌతమ్ నూతన ఆవిష్కరణలతో ముందుకు వెళ్తూ యువ శాస్త్రవేత్తగా జిల్లాకు మంచి పేరు తీసుకువస్తున్నారని కలెక్టర్ కొనియాడారు. ఇటీవల ఉగాది పురస్కారం అందజేసి సత్కరించారు. రానున్న రోజుల్లో మరిన్ని ఆవిష్కరణలు చేపట్టి అంతర్జాతీయ స్థాయిలో జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
కొత్త ఆలోచనలు.. సరికొత్త ఆవిష్కరణలు..
కొత్త ఆలోచనలు.. సరికొత్త ఆవిష్కరణలు..
కొత్త ఆలోచనలు.. సరికొత్త ఆవిష్కరణలు..
కొత్త ఆలోచనలు.. సరికొత్త ఆవిష్కరణలు..
కొత్త ఆలోచనలు.. సరికొత్త ఆవిష్కరణలు..


