భూప్రకంపనలు! | - | Sakshi
Sakshi News home page

భూప్రకంపనలు!

Jun 19 2025 3:54 AM | Updated on Jun 19 2025 3:54 AM

భూప్ర

భూప్రకంపనలు!

అధికార పార్టీలో
సీతయ్య వ్యవహారంపై కూటమి నేతల కినుక
● అధిష్టానం పేరుతో వ్యవహారాలు నడుపుతున్నారంటూ మండిపాటు ● స్థానిక నేతలకూ మరకలు అంటించడంపై ఆగ్రహం ● ఎండాడ వ్యవహారంపై గంటా సీరియస్‌ ● విచారణ జరిపించాలని కలెక్టర్‌కు లేఖ ● పక్కాగా విచారిస్తే సీతయ్యతో పాటు కీలక వ్యక్తుల ప్రమేయం బట్టబయలు

సర్వే

నెంబర్ల

వారీగా

వివరాలు..!

ప్రాంతం సర్వే నెంబరు

మధురవాడ 370/1

మధురవాడ 352/3

తలారివానిపాలెం 35/4

కొమ్మాది 150/2

శనివాడ 92

ముడసర్లోవ 31–2

మధురవాడ 367/1

తర్లువాడ 3/3

ఎస్‌ఆర్‌ పురం 99

కొమ్మాది 114/1

వడ్లపూడి 122/1

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం :

ధికార పార్టీలో ‘భూ’ప్రకంపనలు మొదలయ్యాయి. అధిష్టానం పెద్దలు తెలుసంటూ సీతయ్య చేస్తున్న భూ వ్యవహారాలపై స్థానిక నేతలు మండిపడుతున్నారు. తమ దృష్టిలో కనీసం పెట్టకుండా వ్యవహారాలు కానివ్వడమే కాకుండా ఆ మరకలు తమకు కూడా అంటించేలా ప్రయత్నం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎండాడలోని ఐదు ఎకరాల భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగిచండంతో పాటు రికార్డులు సరిగా లేని వ్యక్తికి వచ్చే విధంగా చక్రం తిప్పారు. ఇందుకుగాను రెండు ఎకరాల మేరకు సదరు నేతకు లబ్ధి చేకూరేలా వ్యవహారం నడిచిందనే విమర్శలున్నాయి. ఈ భూ వ్యవహారంలో స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేరును కూడా సదరు నేత లాగే ప్రయత్నం చేసినట్టు అధికార పార్టీలో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో సీతయ్యపై గంటా సీరియస్‌ కావడంతో పాటు.. ఈ భూవ్యవహారాన్ని తేల్చాలంటూ నేరుగా కలెక్టరుకు లేఖ రాయడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. అధిష్టానానికి దగ్గరగా ఉండే నేతల పేర్లు చెబుతూ సీతయ్య నడిపిన వ్యవహారంతో పాటు ఎండాడ భూ వ్యవహారంలో జరిగిన రికార్డుల మార్పిడి తంతు కూడా బయటపడే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాకుండా మధురవాడ, కొమ్మాది, ఎస్‌ఆర్‌ పురం ఇలా మొత్తం 11 సర్వే నెంబర్లలోని భూములపై సదరు నేత కన్నుపడినట్టు చర్చ నడుస్తోంది. కీలక వ్యక్తుల ద్వారా పనికానిస్తానంటూ రికార్డులన్నీ తీసుకుని వ్యవహారాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

ఈ భూములపైనే వ్యవహారాలు

రాష్ట్రంలో భూముల ధరలు అధికంగా విశాఖపట్నం జిల్లాలో ఉన్నాయి. ప్రతీ సర్వే నెంబరుకు ఏదో ఒక సమస్య వెంటాడుతోంది. ప్రధానంగా పెందుర్తి, మధురవాడ, కొమ్మాది ప్రాంతాల్లో ఇలాంటివి కోకొల్లలు. ఇవే ఇప్పుడు అధికార పార్టీకి చెందిన నేతకు వరంగా మారింది. తనకు అధిష్టానంలోని కీలక వ్యక్తులతో దగ్గరి సంబంధాలు ఉన్నాయని... వీటిని నిషేధిత జాబితా నుంచి తొలగించేలా చేస్తానని.. చెరో సగం వాటా తీసుకుందామని ఒప్పందాలు చేసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ విధంగానే ఎండాడలోని భూవ్యవహారం చక్కబెట్టిన అతడు ఇతర భూములపై కూడా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ప్రధానంగా మధురవాడలో 3 సర్వే నెంబర్లు, కొమ్మాది, పెందుర్తిలోని భూములపై సదరు నేత కన్ను పడింది. వీటిపై ఇప్పటికే పలు దఫాలుగా రెవెన్యూ వర్గాలతో చర్చలు నడిపి.. డీల్‌ కుదుర్చుకున్నట్టు కూడా ప్రచారం జరిగింది. కలెక్టరు కాస్తా అసలు గుట్టును కనిపెట్టడంతో కొద్దిరోజులుగా వ్యవహారాలు నిలిచిపోయినట్టు ప్రచారం జరుగుతోంది. కీలక వ్యక్తులతో తనకున్న పరిచయాల ద్వారా పనికానిస్తానంటూ సదరు సీతయ్య నమ్మబలుకుతున్నట్టు తెలుస్తోంది.

రికార్డుల్లో ఒకరు.. లబ్ధిదారు మరొకరు..!

వాస్తవానికి ఎండాడలోని భూమి వ్యవహారంపై ఇప్పటికే అనేక విమర్శలున్నాయి. ఏప్రిల్‌ 12, 18వ తేదీల్లో ‘సాక్షి’ వరుస కథనాలను కూడా ప్రచురించింది. అడంగల్‌తో పాటు రికార్డులన్నీ మార్చేశారని పేర్కొంటూ ఆధారాలతో సహా వివరించే ప్రయత్నం చేసింది. గతంలో కలెక్టరు పంపిన గెజిట్‌లో ఉన్న పేరుకు... తాజాగా నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ ఇచ్చిన ఆదేశాల్లో మరో పేరు పేర్కొన్నారు. ఎండాడలోని 14/1 సర్వే నెంబరులో 5.10 ఎకరాల భూమి ఉంది. ఇది ప్రభుత్వ భూమిగా ఉందని.. అయితే, డీ–పట్టా సీతారామయ్య పేరు ఉందని పేర్కొంటూ స్వయంగా కలెక్టర్‌ గెజిట్‌లో పేర్కొన్నారు. అయితే, ఇదే సర్వే నెంబరులోని భూమిని వై.బాలిరెడ్డికి అసైన్‌ చేశారని, ఆయన కుమారుడు వై.జోజిరెడ్డికి చెందుతుందని పేర్కొంటూ.. నిషేధిత జాబితా నుంచి తొలగిస్తున్నందున రిజిస్ట్రేషన్లు చేయవచ్చంటూ కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మార్చి 12వ తేదీన పలువురు వ్యక్తులతో డెవలప్‌మెంట్‌ కమ్‌ జీపీఏ చేసుకుంటూ రిజస్ట్రేషన్ల తంతును కూడా కానిచ్చారు. ఈ వ్యవహారమంతా సదరు సీతయ్య ద్వారా నడిచిందని అధికార పార్టీలో బహిరంగంగానే చర్చ నడుస్తోంది. అంతేకాకుండా నేరుగా కీలక వ్యక్తుల ద్వారా పనికానిచ్చారని కూడా వ్యాఖ్యానించుకుంటున్నారు. ఈ వ్యవహారంలో స్థానిక ఎమ్మెల్యే గంటాకు కూడా పాత్ర ఉందనే కోణంలో సదరు సీతయ్యనే ప్రచారం చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఆగ్రహించిన గంటా తాజాగా ఈ భూవ్యవహారంపై లోతైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కలెక్టరుకు లేఖలో కోరారు. దీంతో సదరు సీతయ్య వ్యవహారం మొత్తం బయటకు వస్తుందా? లేదా అనేది చూడాల్సి ఉంది. వీటితోనే ఆగకుండా మరికొన్ని సర్వే నెంబర్లపైనా సదరు సీతయ్య గురి ఉందని తెలుస్తోంది.

భూప్రకంపనలు!1
1/2

భూప్రకంపనలు!

భూప్రకంపనలు!2
2/2

భూప్రకంపనలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement