హైవేపై హడల్‌! | - | Sakshi
Sakshi News home page

హైవేపై హడల్‌!

Jun 19 2025 3:54 AM | Updated on Jun 19 2025 3:54 AM

హైవేప

హైవేపై హడల్‌!

● యోగాంధ్ర ఏర్పాట్లతో బీచ్‌రోడ్డు మూసివేత ● దీంతో రహదారిపై పెరిగిపోయిన వాహనాల రద్దీ ● కిలోమీటర్‌ మేర నిలిచిపోయిన వాహనాలు ● గంటల తరబడి ట్రాఫిక్‌లో వాహనదారుల ఇబ్బందులు ● 21వ తేదీ వరకు వాహనాల రాకపోకలు నిలిపివేత

విశాఖ సిటీ: ‘యోగాంధ్ర’ విశాఖ వాసులకు చుక్కలు చూపిస్తోంది. బీచ్‌రోడ్డులో వాహనాలను నిషేధించిన తొలిరోజే వాహనదారులకు ప్రత్యక్ష నరకం కనిపించింది. బుధవారం కనీవినీ ఎరుగని రీతిలో హైవేపై ట్రాఫిక్‌ స్తంభించి పోయింది. ప్రధానంగా మద్దిలపాలెం నుంచి విశాలాక్షినగర్‌ వరకు వాహనాలతో కదల్లేని పరిస్థితి నెలకొంది. అంతర్జాతీయ యోగా దినోత్సవ ఏర్పాట్లలో జిల్లా యంత్రాంగం నిమగ్నమై ఉంది. కోస్టల్‌ బ్యాటరీ నుంచి భీమిలి వరకు బీచ్‌రోడ్డులో యోగాంధ్ర కోసం కంపార్ట్‌మెంట్లను ఏర్పాటు చేస్తోంది. ఈ క్రమంలో బీచ్‌రోడ్డుకు వెళ్లే దారులన్నింటినీ అధికారులు మూసివేశారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం విద్యార్థులు, ఉద్యోగస్తులు సకాలంలో స్కూళ్లు, కళాశాలలు, కార్యాలయాలకు చేరుకోలేకపోయారు. సాయంత్రం ఇంటికి చేరుకోవడానికి అష్టకష్టాలు పడ్డారు.

21 వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు

యోగాంధ్ర వేడుకలను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు తలమునకలై ఉన్నారు. ఈ నెల 17 నుంచి 21వ తేదీ వరకు నగరంలో పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఆర్‌కే బీచ్‌ వద్ద ప్రధాన వేదికతో పాటు పార్క్‌ హోటల్‌ వరకు 15 కంపార్ట్‌మెంట్ల పనులు జరుగుతున్నాయి. అలాగే భీమిలి వరకు ఉన్న 26 కిలోమీటర్ల మేర యోగాసనాలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో బీచ్‌ రోడ్డుతో పాటు బీచ్‌కు వెళ్లే ప్రధాన రహదారులన్నింటినీ మూసివేశారు. ఈ కారణంగా హైవేపై ట్రాఫిక్‌ రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. ట్రాఫిక్‌ ఆంక్షలు విధించిన తొలిరోజే హైవేలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ నెల 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు ఉండనున్నాయి. ఈ మూడు రోజులు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని పోలీసులు సూచిస్తున్నారు.

కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌

నగరంలో ఇతర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ సమస్య ఉత్పన్నం కానప్పటికీ.. మద్దిలపాలెం నుంచి డెయిరీ ఫారం వరకు ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తాయి. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని ప్రయత్నించినప్పటికీ.. ఆ రోడ్లు, సందులు కూడా వాహనాలతో కదల్లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో అందరూ తప్పనిసరి పరిస్థితుల్లో హైవేపైనే ప్రయాణించాల్సి వచ్చింది. మద్దిలపాలెం జంక్షన్‌ నుంచి ఎండాడ వరకు ఒక్కో జంక్షన్‌ దాటాలంటే చుక్కలు కనిపించాయి. వెంకోజీపాలెం నుంచి హనుమంతవాక వరకు పరిస్థితి మరింత దారుణంగా మారింది. పోలీసులు కూడా ఒకవైపు యోగాంధ్రకు వచ్చే వీవీఐపీలు, వీఐపీలు, ఇతర ప్రముఖుల భద్రతా చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. మరోవైపు ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణపై దృష్టి పెట్టారు. అయితే అనూహ్యంగా పెరిగిన ట్రాఫిక్‌ను నియంత్రించడానికి పోలీసులు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. ఎంత మంది ట్రాఫిక్‌ పోలీసులు రద్దీ నియంత్రణకు హైరానా పడినా.. వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్‌లో నిలిచిపోవాల్సి వచ్చింది. ఎంవీపీ డబుల్‌ రోడ్డులో ఉదయం అంబులెన్సుకు దారి ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. మొదటి రోజే ఇలా ఉంటే.. మరో మూడు రోజులు ట్రాఫిక్‌ ఇబ్బందుల నుంచి నగరవాసులు ఎలా గట్టెక్కుతారో వేచి చూడాలి. దీనిపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో.?

హైవేపై హడల్‌!1
1/1

హైవేపై హడల్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement