
ఆటో బోల్తా.. ఒకరి దుర్మరణం
మద్యం మత్తులో ఆటో నడపడంతో ప్రమాదం
గాజువాక: మద్యం మత్తులో ఆటో నడపడంతో ఒక వ్యక్తి ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. అతడితో పాటు ప్రయాణిస్తున్న మరో నలుగురు వ్యక్తులు అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాజువాక ట్రాఫిక్ పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక ప్రశాంతినగర్కు చెందిన బలగం సురేష్ (26) పీవీసీ వర్క్షాప్ నిర్వహిస్తున్నాడు. స్నేహితులు లోకేష్, దుర్గాప్రసాద్తోపాటు మరో ఇద్దరితో కలిసి చినగంట్యాడలో మందు పార్టీ చేసుకున్నారు. అప్పటికే బాగా తాగి ఉన్న ఆ ఐదుగురు వ్యక్తులు ఎన్ఏడీ జంక్షన్లో వేరే పార్టీ కోసం ఆటోలో బయలుదేరి వెళ్తున్నారు. ఆ ఆటోను ఐదుగురిలో ఒకడైన లోకేష్ నడుపుతున్నాడు. పంతులుగారి మేడ జంక్షన్కు వెళ్లేసరికి ఆటో అకస్మాత్తుగా తిరగబడిపోయింది. ఈ సంఘటనలో నలుగురు వ్యక్తులు బయటకు తుళ్లిపోగా, సురేష్పై ఆటో పడిపోయింది. దీంతో అతడు సంఘటనా స్థలంలోనే దుర్మరణం పాలయ్యాడు. మిగిలిన నలుగురు వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.