వసూళ్లు | - | Sakshi
Sakshi News home page

వసూళ్లు

Jun 16 2025 5:05 AM | Updated on Jun 16 2025 5:05 AM

వసూళ్లు

వసూళ్లు

అన్ని శాఖల్లోనూ
నకిలీ ఏసీబీ సీఐ లీలలెన్నో..
● నేరుగా, ఫోన్‌ పే ద్వారా కలెక్షన్లు ● మధురవాడ జెడ్సీ కార్యాలయంలోనూ తిష్ట ● ఏసీబీ కార్యాలయంలో ఓ సీఐ వద్ద బాతాఖానీ ● నగరంలోని మరో విభాగంలో కొలువైన సదరు సీఐ ● వసూళ్లపై ఫిర్యాదుకు అధికారుల వెనుకంజ ● లోతుగా విచారిస్తే మరిన్ని పెద్ద తలకాయలు బయటకు..

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం

కిలీ ఏసీబీ సీఐ సుధాకర్‌ లీలలు ఒక్కొక్క టిగా బయటకు వస్తున్నాయి. నగరంలోని కీలక విభాగాలన్నింటిలోనూ అతడు వసూళ్లకు తెగబడినట్టు తెలుస్తోంది. అధికారుల నుంచి నేరుగాను.. ఫోన్‌ పే ద్వారా కూడా భారీగా వసూళ్లు చేసినట్లు సమాచారం. ఏసీబీ అధికారినంటూ మధురవాడ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లి డబ్బులు డిమాండ్‌ చేయగా.. సదరు సబ్‌ రిజిస్ట్రార్‌ నేరుగా ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో సుధాకర్‌ గుట్టు కాస్తా రట్టయింది. ఆయనతో పాటు ఏసీబీ జాయింట్‌ డైరెక్టర్‌నని ఫోన్‌లో మాట్లాడిన వేరే ప్రాంతంలో పనిచేస్తున్న ఓ మహిళా ఏఆర్‌ సీఐ పాత్ర కూడా బట్టబయలైంది. అయితే అంతకు ముందుగా మధురవాడలోని జీవీఎంసీ జోనల్‌ కార్యాలయం (జెడ్సీ)లో రూ. 25 వేల వరకూ వసూలు చేసి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు రెవెన్యూ, మైనింగ్‌, జీవీఎంసీలోని వివిధ విభాగ అధికారుల వద్ద నుంచి కూడా భారీగా వసూలు చేసినట్టు సమాచారం. అంతేకాకుండా గతంలో ఏసీబీలో పనిచేసి... ప్రస్తుతం బదిలీపై నగరంలోనే వేరే కార్యాలయంలో పనిచేసే సీఐకు కూడా సదరు నకిలీ సీఐతో లింకులు ఉన్నట్టు విచారణలో తేలినట్టు సమాచారం. అంతేకాకుండా ఒక కార్పొరేషన్‌ చైర్మన్‌తో కూడా విమానాల్లో విదేశాలకు సంచరించినట్టు ఇప్పటికే ఫొటోలతో కూడిన ఆధారాలతో తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు లోతుగా విచారిస్తే మరిన్ని పెద్ద తలకాయల పేర్లు బయటకు వస్తాయనే అభిప్రాయం మాత్రం సర్వత్రా వ్యక్తమవుతోంది.

సీఐతో మాటా మంతీ...!

గతంలో ఏసీబీలో పనిచేసే సమయంలో ఓ సీఐ కూర్చునే రూమ్‌కు రెగ్యులర్‌గా సదరు నకిలీ ఏసీబీ సీఐ వచ్చేవాడని ఏసీబీ కార్యాలయంలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు విశాఖపట్నంలోనే వేరే విభాగంలో పనిచేసే సదరు సీఐ రూమ్‌లో గంటల తరబడి ఇద్దరూ మాటామంతీ జరిపేవారని సమాచారం. ఆ సమయంలో కూడా ఏసీబీకి వచ్చే ఫిర్యాదులు కాస్తా లీకయ్యాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా సుధాకర్‌తో పాటు పట్టుబడి సస్పెండైన మహిళా సీఐకు... ఏసీబీలో గతంలో పనిచేసిన సీఐకు కూడా మంచి సంబంధాలే ఉండేవని సమాచారం. ఈ కోణంలో కూడా సుధాకర్‌కు గతంలో ఏసీబీలో పనిచేసే సీఐ సహకరించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాకుండా విద్యుత్‌ శాఖలో పనిచేసే మరో ఉద్యోగికి కూడా ఈ నకిలీ ఏసీబీ సీఐ బాగా పరిచయస్తుడని తెలుస్తోంది. మొత్తంగా నగరంలోని అనేక విభాగాల అధికారులతో ఎంతో చనువుగా ఉంటూ... అవినీతిపరుల జాబితాను సేకరించి వసూళ్లకు తెగబడ్డారని అర్థమవుతోంది. అయితే, అంతులేని ఈ నకిలీ ఏసీబీ సీఐ వ్యవహారంలో పోలీసుల విచారణ లోతుగా సాగడం లేదనే విమర్శలు మాత్రం వినిపిస్తున్నాయి.

లోతైన విచారణ ఏదీ...!

వాస్తవానికి నకిలీ ఏసీబీ సీఐ వ్యవహారంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే, లోతుగా విచారణ జరగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నకిలీ ఏసీబీ సీఐకు ఫోన్‌ పే చేసిన వారిని విచారించినప్పటికీ.. తమకేమీ సంబంధం లేదన్నట్టుగా పోలీసుల ముందు బుకాయిస్తున్నట్టు తెలుస్తోంది. తమను బెదిరించి వసూళ్లు చేశారనే కోణంలో కూడా ఎవరూ ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాలేదని పోలీసువర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, అధికార పార్టీకి చెందిన ఓ కార్పొరేషన్‌ చైర్మన్‌తో పాటు పలువురు పోలీసులకు, వివిధ విభాగాల అధికారులకు కూడా మంచి సంబంధాలు ఉండటమే కారణమని తెలుస్తోంది. ఆయా ఫొటోలు కూడా ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. అయినప్పటికీ పోలీసులు మాత్రం మిన్నకుండిపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతులేకుండా సాగిన నకిలీ ఏసీబీ సీఐ వసూళ్ల కథలో అనేక మంది ఆయనను నేరుగా కలిసి మామూళ్లు ఇవ్వడమో.. ఫోన్‌ పే ద్వారా చెల్లింపులు చేసిన వారే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో లోతుగా విచారణ జరిపితే అందరి బాగోతాలు బయటపడతాయనే ఆందోళనే కారణమనే విమర్శలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement