
ఏడాది పాలనతో అంతా మోసమే..!
● రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్ సీపీ పీఏసీ మెంబర్ గొల్ల బాబూరావు ● కూటమి ప్రభుత్వ ఏడాది వైఫల్యాలపై కేకే రాజు ఆధ్వర్యంలో వెన్నుపోటు పుస్తకావిష్కరణ
సాక్షి, విశాఖపట్నం : వైఎస్ జగన్మోహన్రెడ్డి అంటే ఓ నమ్మకం.. చంద్రబాబు అంటే మోసానికి మారుపేరు అని రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్ సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ గొల్ల బాబూరావు అన్నారు. ఆదివారం మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో వైఫల్యాలపై వెన్నుపోటు పుస్తకాన్ని వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, వాసుపల్లి గణేష్కుమార్, సమన్వయకర్తలు మొల్లి అప్పారావు, దేవన్రెడ్డితో కలిపి ఆయన ఆవిష్కరించారు. ముందుగా బి.ఆర్.అంబేడ్కర్, వైఎస్సార్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గొల్ల బాబూరావు మాట్లాడుతూ పేద ప్రజలను మోసం చేయడం, అక్రమాలు చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. అబద్దపు హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు సంక్షేమ పథకాలు ఇవ్వకుండా కాలయాపన చేయడమే కాకుండా.. ఇచ్చిన ఒకటి రెండు పథకాల్లో కూడా కోతలు విధిస్తున్నారని మండిపడ్డారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో పేదల ఇంటికి సంక్షేమ పథకాలు అందించామని, అవన్ని ప్రజలు గుర్తుచేసుకుంటున్నారన్నారు. పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మాట్లాడుతూ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చంద్రబాబు వైఫల్యం చెందారన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏడాదిలోనే అన్ని పథకాలను అమలు చేస్తే.. నేటి కూటమి ప్రభుత్వంలో ఏడాది పూర్తయినా ఒక పథకం కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. టీవీ ఛానళ్లు, పత్రికలను చుట్టూ పెట్టుకుని ప్రతీ రోజూ అబద్దపు కథనాలు రాస్తున్నారని మండిపడ్డారు. సంక్షేమ పథకాలు, హామీల గురించి ఎవరైనా మాట్లాడితే కేసులు పెడతామని బెదిరిస్తున్నారన్నారు.
ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని హరిస్తోందని మండిపడ్డారు. అసెంబ్లీని రబ్బర్ స్టాంప్లా చేస్తుందని, ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వంపై ఏడాదిలో పూర్తి వ్యతిరేకత పెరిగిందని, వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీసీ విజయం ఖాయమన్నారు. కార్యకర్తలెవరూ నిర్లక్ష్యంగా ఉండకూడదు.. నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేయాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తిరెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య, డిప్యూటీ మేయర్ కె.సతీష్, పార్టీ కార్యాలయం పర్యవేక్షకులు రవిరెడ్డి, ముఖ్య నాయకులు పేర్ల విజయచందర్, ఉడా రవి, రొంగలి జగన్నాథం, గొలగాని శ్రీనివాస్, జహీర్ ఆహ్మద్, నడింపల్లి కృష్ణంరాజు, రవిరాజు, ఉపాధ్యక్షులు బాణాల శ్రీనివాసరావు, చెన్నా జానకిరామ్, జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లు శంకరరావు, ద్రోణంరాజు శ్రీవాత్సవ, కార్పొరేటర్లు కె.అనిల్కుమార్ రాజు, శశికళ, బిపిన్ కుమార్, జిల్లా అనుబంధ అధ్యక్షులు పేడాడ రమణి కుమారి, భర్కత్ అలీ, పులగం కొండారెడ్డి, పీలా జగదీష్, ఎస్.ప్రసాదరావు, రామిరెడ్డి, బోండా ఉమా మహేశ్వరరావు, దేవరకొండ మార్కండేయులు, రాష్ట్ర, జిల్లా పార్టీ అనుబంధ కమిటీ సభ్యులు దొడ్డి కిరణ్, కాళిదాస్రెడ్డి, అల్లంపల్లి రాజబాబు, కిరణ్రాజు, పల్లా దుర్గారావు, మంచా నాగమల్లీశ్వరి, కొణతాల రేవతిరావు, జె.నాగేంద్ర, పద్మ, నీలి రవి, బి.పద్మావతి, శ్రీదేవి వర్మ, శ్రీనివాస్ గౌడ్, కొట్యాడ సూర్య తదితరులు పాల్గొన్నారు.