
యోగా దినోత్సవానికి విస్తృత ఏర్పాట్లు
● భారీగా జనం తరలింపునకు ఏర్పాట్లు ● ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనాల్లోనే బీచ్రోడ్డుకు రావాలి ● కలెక్టర్ హరేందిర ప్రసాద్
మహారాణిపేట: బీచ్రోడ్డులో ఈ నెల 21న జరగనున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రధాని మోదీ హాజరవుతున్నారు. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషి చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ సూచించారు. బీచ్రోడ్డులో యోగా దినోత్సవం ఏర్పాట్లపై నగర ప్రజాప్రతినిధులతో ఆదివా రం కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో కలెక్టర్ ఈ వివరాలు వెల్లడించారు. ప్రజలు ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాటు చేసిన బస్సులు, ఆటోలు, టాటా మ్యాజిక్ వంటి వాహనాల్లో మాత్రమే బీచ్రోడ్డులోని తమకు కేటాయించిన ప్రాంతానికి చేరుకోవాలని, ప్రైవేట్ వాహనాలకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు.
ప్రజల తరలింపునకు ప్రత్యేక ఏర్పాట్లు
నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన, గుర్తించిన ప్రాంతాలకు ప్రజలను సకాలంలో తరలించడం ముఖ్యమని కలెక్టర్ తెలిపారు. ఆయా నియోజకవర్గాల నుంచి ఉదయాన్నే బస్సులు బయలుదేరేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. ప్రతి వార్డు సచివాలయానికి కేటాయించిన ప్రాంతం గురించి ఇప్పటికే సమాచారం అందించామని, స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు సమన్వయం చేసుకుని ప్రజలు తెల్లవారుజామున ఆ ప్రాంతానికి చేరుకునేలా చూడాలని కోరారు. బస్సులకు వార్డు సచివాలయం కార్యదర్శులను ఇన్చార్జిలుగా నియమిస్తున్నామని, పికప్, డ్రాపింగ్ పాయింట్ల వివరాలతో కూడిన బ్యానర్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
2,185 బస్సులు సిద్ధం: ప్రజలను తరలించేందుకు జిల్లాలో మొత్తం 2,185 బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. వీటికి అదనంగా ఆటోలు, టాటా ఏస్, మ్యాజిక్ వంటి వాహనాల్లో కూడా తరలింపు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈ బస్సులన్నీ 20వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకే ఆయా ప్రాంతాలకు చేరుకుంటాయన్నారు.
ఉచితంగా టీ షర్ట్లు, మ్యాట్లు, స్నాక్స్
యోగా కార్యక్రమంలో పాల్గొనే వారందరికీ ఉచితంగా టీ షర్ట్లు, మ్యాట్లు అందజేస్తామని కలెక్టర్ చెప్పారు. అలాగే స్నాక్స్ ప్యాకెట్లు అందిస్తామన్నారు.
పార్కింగ్ కేటాయింపులు
విశాలాక్షినగర్ వరకు ఉన్న బీచ్రోడ్డును నగరంలోని వివిధ ప్రాంతాల ప్రజలకు కేటాయించారు. పెందుర్తి, అనకాపల్లి ప్రాంతాల వారికి లా కాలేజ్ రోడ్డు, విజయనగరం జిల్లా వారికి మధురవాడ ఐటీ సెజ్ ప్రాంతం, శ్రీకాకుళం వారికి తిమ్మాపురం నుంచి భీమిలి వరకు మార్కింగ్ చేశారు. ఒక్కో కంపార్ట్మెంట్లో 600 మంది పాల్గొనే అవకాశం ఉంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముందురోజు నగరానికి చేరుకుంటారని పేర్కొన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు పి.విష్ణుకుమార్ రాజు, పి.గణబాబు, వంశీకృష్ణ శ్రీనివాస్, మేయర్ పీలా శ్రీనివాసరావు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ప్రధాని కార్యక్రమానికి పైసల్లేవ్.!
8లో