
సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన
మహారాణిపేట: ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం విశాఖపట్నం పర్యటనకు రానున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేశారు. ఈ సందర్భంగా ఆదివారం భద్రతా వాహన శ్రేణి ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ ట్రయల్ రన్ విశాఖ విమానాశ్రయం నుంచి ప్రారంభమై నోవాటెల్ హోటల్, ఆర్.కె.బీచ్, ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్స్, పీఎంపాలెం ప్రదేశాల మీదుగా సాగింది. ముఖ్యమంత్రి పర్యటించే మార్గంలో భద్రతా లోపాలు లేకుండా చూసేందుకు ఈ ట్రయల్ రన్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, డీసీపీలు అజిత, మేరీ ప్రశాంతి, ఆర్డీవో శ్రీలేఖ విమానాశ్రయంలో వివిధ శాఖల అధికారులతో భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.