
చెస్ పోటీల్లో విజేతలు కృష్ణ, సాత్విక
విశాఖ స్పోర్ట్స్: విశాఖ జిల్లా అండర్–15 చదరంగం పోటీల్లో కృష్ణ, సాత్విక విజేతలుగా నిలిచారు. ఆల్ విశాఖ చెస్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జట్టు ఎంపిక పోటీలు నిర్వహించగా ఓపెన్లో 146 మంది, బాలికలు 59 మంది పాల్గొన్నారు. ఓపెన్లో ఏడు రౌండ్లు నిర్వహించగా బాలికలకు ఆరు రౌండ్లు నిర్వహించారు. ఓపెన్లో పి.కృష్ణ ఆరున్నర పాయింట్లతో విజేతగా నిలవగా ఆరేసి పాయింట్లతో ఉద్ధవ్ లక్ష్మణ్, పి.అనిరుథ్ తర్వాత స్థానాల్లో నిలిచారు. బాలికల్లో పి.సాత్విక ఆరు పాయింట్లతో విజేతగా నిలవగా ఎం.దివ్యవర్షిణి, అఫ్ణీన్ ఐదేసి పాయింట్లతో తర్వాత స్థానాల్లో నిలిచారు. తొలి రెండు స్థానాల్లో నిలిచిన కృష్ణ, ఉద్ధవ్, సాత్విక, దివ్య జిల్లా జట్టుకు ఎంపికయ్యారు. అంతర్ జిల్లాల అండర్–15 చదరంగం పోటీలు జూలై 12,13వ తేదీల్లో విశాఖలోనే జరగనున్నాయి.