
కూటమి ఏడాది పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదు
ఘనంగా పునీత ఆంథోనీ చర్చి పండగ
డాబాగార్డెన్స్: రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏడాది పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు ఆక్షేపించారు. జగదాంబ సమీపానున్న పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు డాక్టర్ బి.గంగారావు, ఆర్కేఎస్వీ కుమార్, వి.కృష్ణారావులతో కలిసి శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల ముందు విశాఖ ప్రజలకు ఇచ్చిన హామీలకు భిన్నమైన పాలన సాగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ పాలనలో ప్రజలపై భారాలు పెరిగాయి తప్ప, ప్రధాన సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని ధ్వజమెత్తారు. తొలుత అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాద మృతులకు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వారు మాట్లాడుతూ విశాఖ ఉక్కును, కార్మికులను కాపాడతామని ఎన్నికల ముందు మభ్యపెట్టి, ఇప్పుడు కేంద్రం చెప్పుచేతల్లో నడుస్తూ ప్లాంట్ ప్రైవేటీకరణకు అండగా నిలుస్తున్నారని ఎద్దేవా చేశారు. రూ.11,440 కోట్లు ప్యాకేజీలో ఒక్క రూపాయి కూడా ప్లాంట్కు ఖర్చు చేయనివ్వలేదని ఆరోపించారు. విశాఖ రైల్వే జోన్ ప్రతిపాదించి 11 నెలలైనా ఇంత వరకు కేంద్రం నుంచి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయించలేకపోయారని ఆక్షేపించారు. జమ్మూ రైల్వే డివిజన్ ఏర్పాటును 2025 జనవరిలో ప్రకటిస్తే 6 మాసాల్లోపే డీపీఆర్ ఆమోదంతో పాటు గెజిట్ నోటిఫికేషన్కూడా వచ్చిందన్నారు. అధికారంలోకి వస్తే విలువ ఆధారిత ఆస్తిపన్ను రద్దు చేస్తామని చెప్పి, ఇప్పుడు 15 శాతం పన్ను పెంచేయడం దారుణమన్నారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లపై టీడీపీ ద్వంద్వ వైఖరిని విమర్శించారు. ఇళ్లులేని పేదలకు టిడ్కో ఇల్లు, 2 సెంట్ల భూమి హామీ అతీగతిలేదన్నారు. సూపర్ సిక్స్ పేరిట ప్రజలను మభ్యపెట్టడం సరికాదన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, నెలకు రూ.1500 ఆర్థిక సాయం, నిరుద్యోగ భృతి ఇతర హామీలు వాయిదాలు వేస్తున్నారని, గత ప్రభుత్వం ఇచ్చిన పథకాలు నిలిపివేయడం దారుణమన్నారు.
డబుల్ ఇంజిన్ సర్కార్లో విశాఖ ప్రజలపై భారాలు
మీడియాతో సీపీఎం విశాఖ జిల్లా కమిటీ