
సీఎన్సీ ప్లాస్మా కటింగ్ మెషీన్ ప్రారంభం
సింధియా: విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ కోసం నిర్మిస్తున్న 60టీ బోలార్డ్ పుల్ టగ్ స్టీల్ కటింగ్ వేడుక గురువారం ఘనంగా జరిగింది. హిందూస్థాన్ షిప్యార్డ్ హల్ షాప్ వద్ద ఏర్పాటు చేసిన సీఎన్సీ ప్లాస్మా కటింగ్ మెషీన్ను పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ అంగముత్తు ప్రారంభించారు. ముందుగా చైర్మన్ అంగముత్తును హిందూస్థాన్ షిప్యార్డ్ సీఎండీ హేమంత్ ఖత్రి ఘన స్వాగతం పలికారు. రెండు సంస్థల మధ్య బలమైన, దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని ప్రతిబింబించేలా జరిగిన ఈ వేడుకలో విశాఖపట్నం పోర్ట్, షిప్యార్డ్ కార్మికులు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షిప్యార్డ్ సీఎండీ మాట్లాడుతూ సముద్ర రంగం అభివృద్ధిలో విశాఖ పోర్ట్, షిప్యార్డ్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయన్నారు. కార్బన్ ఉద్గారాలను తగ్గించే లక్ష్యంతో భవిష్యత్తులో ఎలక్ట్రిక్, హైడ్రోజన్ శక్తితో నడిచే గ్రీన్ టగ్స్ అభివృద్ధికి హెచ్ఎస్ఎల్ కృషి చేస్తోందని తెలిపారు. పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ మాట్లాడుతూ హిందూస్థాన్ షిప్యార్డ్ సంస్థ నౌకా నిర్మాణ రంగంలో సృష్టిస్తున్న అద్భుతాలు, నూతన పని విధానాలను అభినందించారు. పోర్ట్ ట్రస్ట్ కోసం నిర్మిస్తున్న టగ్ నిర్మాణ పద్ధతులను వివరించారు.