
బడిలో
సమస్యల గంట
● తొలి రోజు హాజరు అంతంతమాత్రమే ● అరకొరగా పుస్తకాల పంపిణీ ● కానరాని బ్యాగులు, బూట్ల పంపిణీ ● జమకాని తల్లికి వందనం నగదు ● తల్లిదండ్రుల్లో తీవ్ర నిరాశ
సగం మందికే తల్లికి వందనం
ఎన్నికల ముందు కూటమి నేతలు ప్రతి కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి రూ.15 వేలు చొప్పున ‘తల్లికి వందనం’కింద జమ చేస్తామని హామీలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచిపోయింది. మొదటి సంవత్సరం ఈ పథకాన్ని అమలు చేయకుండా ఎగ్గొట్టేసింది. రెండో ఏడాది పాఠశాలలు తెరిచే నాటికి తల్లికి వందనం నిధులు జమ అవుతాయని ఆశించిన తల్లిదండ్రులకు నిరాశే ఎదురైంది. కాగా.. జిల్లాలో సగం మంది విద్యార్థులకే తల్లికి వందనం అందనుంది. ఇందుకు సంబంధించి జీవో నంబర్లు 26, 27 ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేసిన జాబితాను విద్యా శాఖాధికారులు ప్రకటించారు. ఈ జాబితాలో ఉన్న విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో జూలై 5న ఆర్థిక సాయం చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో 1,90,433 మంది విద్యార్థులు, 1,30, 706 మంది తల్లుల జాబితా సిద్ధమైంది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న అర్హులైనవారందరికీ తల్లికి వందనం ఇస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం జిల్లాలో 1,388 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 3,22,737 మంది విద్యార్థులున్నారు. వీరితో పాటు సుమారు 70 వేల మంది ఇంటర్ విద్యార్థులు కలిపి దాదాపు 4 లక్షల మంది ఉన్నారు. వీరందరికీ తల్లికి వందనం నిధులు వేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం 1,90,433 మంది విద్యార్థులకు మాత్రమే ఆర్థిక సాయం చేయడానికి జాబితా సిద్ధం చేశారు. వారికి కూడా పలు నిబంధనలు వర్తించాలి. పిల్లలు, తల్లిదండ్రుల ఆధార్ నంబర్లు వ్యాలిడేట్ అయి ఉండాలి. నెలవారీ ఆదాయం గ్రామాల్లో రూ.10,000, పట్టణాల్లో రూ.12,000 మించికూడదు. మాగాణి భూమి 3 ఎకరాలు, మెట్ట భూమి 10 ఎకరాలు మించి ఉండకూడదు. నెలసరి 300 యూనిట్లు మించి కరెంట్ వినియోగం ఉండకూడదు. ఆ నిబంధనలకు లోబడి ఉన్న ఒకటి నుంచి 10వ తరగతి విద్యార్థుల తుది జాబితాను ఈ నెల 12 నుంచి 28 వరకు, ఇంటర్ విద్యార్థుల జాబితా ఈ నెల 30న సిద్ధం చేసి గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రకటించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఆరిలోవ: వేసవి సెలవుల సందడి ముగిసింది. బడి గంట మోగింది. గురువారం నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి. సెలవుల్లో ఆటపాటలతో హాయిగా గడిపిన విద్యార్థులు.. మొదటి రోజు బడికి వెళ్లడానికి అయిష్టత చూపారు. చాలామంది చిన్నారులు ‘బడికి వెళ్లం’ అంటూ మారాం చేయడంతో, వారి తల్లిదండ్రులు నచ్చజెప్పి పాఠశాలలకు తీసుకురావాల్సి వచ్చింది. తమ పిల్లలను పాఠశాలల వద్ద దగ్గరుండి దింపి, జాగ్రత్తలు చెప్పి పంపించారు. పుస్తకాల బ్యాగులను వీపుపైకి ఎత్తుకుని చిన్నారులు బడి బాట పట్టారు.
స్వాగతం పలికిన అసౌకర్యాలు
బడికి వచ్చిన విద్యార్థులకు కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని అసౌకర్యాలు స్వాగతం పలికాయి. కొన్ని చోట్ల మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరగా, మరికొన్ని తరగతి గదుల్లో ఫ్యాన్లు విరిగిపోయి ఉన్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పాఠశాల మైదానాలు బురదమయంగా మారాయి. విద్యార్థులు ఆ బురద నీటిని దాటుకుంటూ తరగతి గదులకు వెళ్లాల్సి వచ్చింది.
విద్యార్థి కిట్ల పంపిణీ ఎక్కడ?
పాఠశాలలు తెరిచిన రోజే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మొదటి రోజు నుంచే విద్యార్థుల వద్ద పాఠ్య పుస్తకాలు అందుబాటులో ఉంటాయని చెప్పింది. అయితే ఈ ప్రకటనలు కార్యరూపం దాల్చలేదు. మొదటి రోజు హాజరైన విద్యార్థులకు చాలా పాఠశాలల్లో కిట్లు పంపిణీ చేయలేదు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచిన సందర్భంగా కూటమి పార్టీల నేతలు సంబరాలు చేసుకున్నారు. వారు లేకుండా కిట్లు పంపిణీ చేస్తే ఎక్కడ రాద్ధాంతం చేస్తారో అని ప్రధానోపాధ్యాయులు భయపడి పంపిణీ చేపట్టలేదు.
తొలిరోజు బడులు వెలవెల
జిల్లాలో మొత్తం 1,388 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలున్నాయి. వీటిలో ఒకటి నుంచి 10వ తరగతి వరకు సుమారు 3,22,737 మంది విద్యార్థులు చదువుతున్నారు. దీంతో పాటు కొత్తగా ప్రవేశాలు కూడా జరుగుతున్నాయి. దీంతో వీటి సంఖ్య కొంత వరకు పెరగనుంది. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 72,627 మంది, ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో 2,50,110 మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే
తొలి రోజు ఎక్కువ మంది విద్యార్థులు పాఠశాలలకు హాజరుకాలేదు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరుశాతం అంతంతమాత్రంగానే కనిపించింది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం 30 శాతం మంది విద్యార్థులు హాజరుకాగా, ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ఈ సంఖ్య 40 నుంచి 45 శాతంగా నమోదైంది. దీంతో తరగతి గదులు, పాఠశాల ప్రాంగణాలు విద్యార్థుల సందడి లేక వెలవెలబోయాయి.

బడిలో

బడిలో