
తడబడిన అడుగులు
● నేటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభం ● పూర్తికాని ఉపాధ్యాయుల బదిలీలు ● అసంపూర్తిగా తరగతి గదులు, టాయిలెట్స్ నిర్మాణాలు ● పూర్తిస్థాయిలో రాని స్టూడెంట్స్ కిట్లు ● యూనిఫాం, బూట్లు, సాక్సులు పెండింగ్ ● చాలా పాఠశాలల్లో పనిచేయని ఆర్వో ప్లాంట్లు
ఆరిలోవ: వేసవి సెలవులు పూర్తయ్యాయి. గురువారం నుంచి పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ప్రైవేట్ పాఠశాలలు సకల సౌకర్యాలతో విద్యార్థుల తల్లిదండ్రులను రా రమ్మని స్వాగతం పలుకుతుండగా.. సర్కారు బడులు సౌకర్యాల లేమితోనే విద్యార్థులను ఆహ్వానిస్తున్నాయి. జిల్లాలో కొన్ని పాఠశాలల్లో మురుగుదొడ్లు, అదనపు తరగతి గదుల నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. పలు పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లు పనిచేయడం లేదు. ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. వీటితో పాటు విద్యార్థులకు పాఠశాలలు తెరిచేనాటికే పంపిణి చేయాల్సిన సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లలో(స్టూడెంట్స్ కిట్స్) కొన్ని వస్తువులు కొరత ఉన్నాయి. సాధారణంగా పాఠశాలలు పునఃప్రారంభం నాటికే విద్యాశాఖ అధికారులు అన్ని సిద్ధం చేయాలి. కానీ ఈ విద్యా సంవత్సరం అసౌకర్యాలతో ఆరంభంకానుంది.
స్టూడెంట్స్ కిట్ల కొరత
సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లలో పాఠ్యప్తుకాలు, నోట్ బుక్స్తో పాటు బ్యాగ్, బూట్లు, సాక్సులు, యూనిఫాం, బెల్ట్ ఉండాలి. వాటిలో బ్యాగులు, పాఠ్యపుస్తకాలు కొరతగా ఉన్నాయి. జిల్లాలో 2025–26 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు 72,627 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారిలో 33,830 మంది బాలురు కాగా, 38,697 మంది బాలికలున్నారు. వారందరికి స్టూడెంట్స్ కిట్స్ పంపిణీ చేయాల్సి ఉంది. ఆ కిట్లలో 8,789 స్కూల్ బ్యాగులు కొరతగా పంపించారు. 1,436 పాఠ్య పుస్తకాల కొరత ఉంది. వీటితో పాటు 71,635 మందికి అందించాల్సిన బూట్లు(ఒక జత చొప్పున), సాక్సులు(రెండు జతలు చొప్పున) పూర్తిగా పంపిణీ కాలేదు. బూట్లు, సాక్సులు ఎప్పుడు వస్తాయో విద్యాశాఖాధికారులు వద్ద కూడా స్పష్టత లేకపోవడం విశేషం. ఇంతవరకు ఉన్న కిట్లను మండలాల్లో అన్ని పాఠశాలలకు అధికారులు పంపిణీ చేశారు.
పూర్తికాని ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ
పాఠశాలలు పునఃప్రారంభానికే ఉపాధ్యాయుల బదిలీలు ప్రక్రియ పూర్తిచేస్తామని విద్యాశాఖాధికారులు ముందుగానే ప్రకటించారు. కానీ ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. గురువారం పాఠశాలలు తెరుచుకోనున్నాయి. అయినా ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ సగభాగం కూడా పూర్తికాలేదు. తక్కువ సంఖ్యలో ఉన్న స్కూల్ అసిస్టెంట్లు బదిలీ ప్రక్రియ పూర్తయినప్పటికీ అత్యధిక సంఖ్యలో ఉన్న ఎస్జీటీల బదిలీ ప్రక్రియ మాత్రం ఇంతవరకు ఓ కొలిక్కి రాలేదు. బుధవారం మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు 300 మందికి మాత్రమే మాన్యువల్ కౌన్సెలింగ్ జరిగింది. జిల్లాలో 2,782 మంది ఎస్జీటీలు కౌన్సెలింగ్కు దరఖాస్తు చేసుకొన్నారు. ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఉంటే వారందరికీ కౌన్సిలింగ్ పూర్తయ్యేసరికి మరో వారం పడుతుందని అధికారులు అంటున్నారు.
అసంపూర్తిగా మరుగుదొడ్లు, అదనపు తరగతి గదులు
గతంలో అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు నిర్మాణ పనులు పాఠశాలల్లో చేపట్టారు. వాటిలో కొన్ని పాఠశాలల్లో పనులు ఇప్పటికీ అసంపూర్తిగా మిగిలిపోయాయి. దీంతో ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు ఇబ్బందులు ఎదురుకానున్నాయి.
తోటగరువు హైస్కూల్
అరకొర ప్రవేశాలు
హైస్కూళ్లలో ఇంతవరకు ప్రవేశాలు జరగలేదు. వేసవి సెలవులు ఇచ్చేనాటికే ప్రవేశాలు జరిపించాలని రాష్ట్ర విద్యాశాఖ హైస్కూళ్ల ప్రధానోపాధ్యాయులను ఆదేశించింది. ఇందులో భాగంగా ఉన్నత పాఠశాలల పరిధిలో ఉన్న ప్రాథమిక పాఠశాలలకు వెళ్లి 2024–25 విద్యా సంవత్సరంలో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులను హైస్కూళ్లలో చేర్పించాలని సూచించింది. అయినా ఇంతవరకు ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు ఆరో తరగతిలో చేరలేదు. పునఃప్రారంభం అనంతరం ఆ విద్యార్థులు ఆరో తరగతిలో చేరుతారో లేదో వేచిచూడాల్సిందే. ఇదిలా ఉండగా తరగతి గదిలో విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి 49ః1గా నిర్ణయించారు. దీంతో హైస్కూల్లో అవసరమైన వారి కంటే ఎక్కువమంది ఉపాధ్యాయులు సంఖ్య ఉన్నట్లు లెక్క తేలింది. అదనంగా ఉన్న ఉపాధ్యాయులను ఇప్పుడు వేరేచోటకు బదిలీ చేసేశారు. 2024–25 విద్యా సంవత్సరం వరకు వీరి నిష్పత్తి 40ః1గా ఉండేది. తోటగరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 40ః1గా ఉన్నప్పుడు 57 మంది ఉపాధ్యాయులు ఉండేవారు. ప్రస్తుతం 49ః1 నిష్పత్తి ఉండటంతో 16 మంది ఉపాధ్యాయులు తగ్గిపోయారు.

తడబడిన అడుగులు