
భారత నావికాదళానికి మరింత బలం
త్వరలో 9–10 కొత్త యుద్ధనౌకలు
ఏయూక్యాంపస్: భారత నావికాదళం తన సంపత్తిని మరింత పెంచుకోనుంది. ఈ ఏడాది జూన్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో 9 నుంచి 10 కొత్త యుద్ధనౌకలు భారత నావికాదళంలో చేరనున్నాయి. దీంతో నౌకాదళం తన శక్తిని గణనీయంగా విస్తరించనుంది. ఈ నూతన చేర్పులలో భాగంగా, యాంటీ–సబ్మైరెన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ యుద్ధనౌక ‘అర్ణాలా’ ను జూన్ 18న విశాఖలోని నేవల్ డాక్యార్డ్లో కమిషన్ చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇది నావికాదళం బలాన్ని మరింతగా వృద్ధి చేస్తుంది. త్వరలో కమిషన్ చేయనున్న ఈ యుద్ధనౌకలలో ఎక్కువ భాగం దేశీయంగా తయారు చేసినవేనని అధికారులు తెలిపారు. కమీషనింగ్ కార్యక్రమంలో ఏఎస్డబ్ల్యూ– ఎస్డబ్ల్యూసీ విభాగానికి చెందిన మరిన్ని నౌకలు కూడా ఉంటాయని, విశాఖపట్నం నుంచే ‘అర్ణాలా’ తో పాటు మరికొన్ని ఏఎస్డబ్ల్యూ– ఎస్డబ్ల్యూసీ రకం యుద్ధనౌకలు కమిషన్ చేయబడతాయని పేర్కొన్నారు.