
భీమిలి వరకు యోగా వేడుకలు
మహారాణిపేట: ఈ నెల 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లాలో విస్తృత ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఆరోగ్య, వైద్య కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.టి. కృష్ణబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం జరిగిన సమీక్షా సమావేశంలో హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ జీ. వీరపాండియన్, కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్తో కలిసి ఆయన యోగాంధ్ర కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ భారీ యోగా కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకునే అవకాశం ఉందని, అందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని కృష్ణబాబు సూచించారు. ప్రధాన వేదిక నుంచి భీమిలి వరకు జరిగే ఈ కార్యక్రమానికి విద్యుద్దీకరణ, ఇంటర్నెట్, ఎల్ఈడి స్క్రీన్లు, సీసీ కెమెరాలు, డ్రోన్లు, రవాణా, పార్కింగ్, తాగునీరు వంటి అన్ని ఏర్పాట్లను సమర్థవంతంగా చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో వీఎంఆర్డీఏ కమిషనర్ కే. విశ్వనాథన్, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, పలువురు రాష్ట్ర, జిల్లా అధికారులు, ప్రైవేట్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.