
గంభీరం చేపలకు భలే డిమాండ్
తగరపువలస: ప్రస్తుతం సముద్రంలో చేపల వేట నిషేధం అమలవుతుండటంతో తాజా చేపల లభ్యత తగ్గింది. ఇదే సమయంలో కొన్ని చెరువుల్లో కోళ్ల వ్యర్థాలు వేసి చేపలను పెంచుతున్నారనే ప్రచారం, పట్టణ ప్రాంతాల్లోని కలుషిత నీటిలో పెరిగే చేపల వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయనే భయాలు వినియోగదారులను చెరువు చేపలకు దూరం చేస్తున్నాయి. ఈ తరుణంలో గంభీరం రిజర్వాయర్లోని స్వచ్ఛమైన నీటిలో పెరిగిన చేపలు సురక్షితమైనవి, రుచికరమైనవి కావడంతో వాటికి అమాంతం గిరాకీ పెరిగింది. విశాఖ, మధురవాడ, తగరపువలస తదితర ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున గంభీరం రిజర్వాయర్కు తరలివస్తున్నారు. గంభీరం రిజర్వాయర్లో నీటిమట్టం తగ్గడంతో, పద్మనాభం మండలం పాండ్రంగి మత్స్యకార సొసైటీ సభ్యులు చేపల వేట ముమ్మరం చేశారు. ఇక్కడ 8 కిలోల వరకు బరువున్న భారీ చేపలు కిలో కేవలం రూ.120కే లభిస్తుండటం విశేషం. అంతేకాదు కొనుగోలు చేసిన చేపలను అక్కడికక్కడే కిలోకు రూ.20 చెల్లిస్తే శుభ్రం చేసి ఇస్తుండటంతో వినియోగదారులకు శ్రమ తప్పుతోంది. పెద్ద చేపలను కొన్నవారు తమలో తాము వంతులు వేసుకొని పంచుకుంటున్నారు. ఈ రిజర్వాయర్ చేపల రుచి అమోఘం. ఇది మటన్ను కూడా మరిపిస్తుందని కొనుగోలుదారులు లొట్టలేసుకుంటూ చెబుతున్నారు. చేపలతో పాటు, వాటి గుడ్లతో కూడిన ‘సొన’కు కూడా ప్రత్యేకంగా డిమాండ్ ఉంది. కొందరు చేపలను మాత్రమే తీసుకుని సొనను అక్కడే వదిలేస్తుండగా, దానిని ఇష్టపడేవారు రూ. 50 నుంచి రూ. 100 వరకు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ఈ రిజర్వాయర్లో చేపలు 16 కిలోల వరకు పెరుగుతాయని, అయితే వాటిలో చాలా వరకు వయసు మీద పడటంతో సహ జంగానే మరణిస్తాయని మత్స్యకారులు తెలిపారు.
===========
(08టివిఎల్01)
రిజర్వాయర్ వద్దే తూకం వేసి విక్రయిస్తున్న చేపలు(08టివిఎల్01ఎ)
నాలుగు కిలోల చేపను కొనుగోలు చేసిన వినియోగదారుడు(08టివిఎల్01బి)
(08టివిఎల్01సి, 01డి,01ఇ)
శుభ్రం చేసిన చేపలను వంతులు వేస్తున్న మత్స్యకార మహిళలు(08టివిఎల్01ఎఫ్)
రుచికి ఫిదా అవుతున్న విశాఖ వాసులు

గంభీరం చేపలకు భలే డిమాండ్