
వీసీబీ సభ్యులకు 12 శాతం డివిడెండ్
● మహాజన సభలో చైర్మన్ రాఘవేంద్రరావు ప్రకటన
మద్దిలపాలెం: ది విశాఖపట్నం కో–ఆపరేటివ్ బ్యాంకు(వీసీబీ) 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.71.77 కోట్ల నికర లాభం సాధించిందని, వాటాదారులకు 12 శాతం డివిడెండ్ (రూ. 43.06 కోట్లు) అందిస్తున్నట్లు బ్యాంకు చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు ప్రకటించారు. మద్దిలపాలెంలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం జరిగిన బ్యాంకు మహాజన సభలో ఆయన మాట్లాడారు. గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు డిపాజిట్లు 4.98 శాతం వృద్ధితో రూ. 4354.73 కోట్లకు, రుణాలు 7.42 శాతం వృద్ధితో రూ. 3436.47 కోట్లకు చేరాయన్నారు. బ్యాంకు మొత్తం వ్యాపారం 6.04 శాతం వృద్ధితో రూ.7791.20 కోట్లకు చేరుకుందని, నికర నిరర్థక ఆస్తులు సున్నా శాతంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం బ్యాంకుకు 55 శాఖల్లో 1,11,593 మంది సభ్యులు ఉన్నారని, షేరు ధనం రూ. 389.55 కోట్లకు చేరిందని రాఘవేంద్రరావు తెలిపారు. పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా ఈ ఏడాది మరో 5 కొత్త శాఖలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. బ్యాంకు సీఈవోగా వి.వి.బి.వరలక్ష్మి నియామకానికి మహాజన సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. సహకార రంగానికి, బ్యాంకుకు సుదీర్ఘకాలం సేవలందించిన పూర్వ అధ్యక్షుడు మానం ఆంజనేయులును అభినందన సంచిక ఆవిష్కరణతో ఘనంగా గౌరవించారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ సభ్యులకు సహకార రంగంపై అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. బ్యాంకు పూర్వ జనరల్ మేనేజర్ ఎ.వి.రామకృష్ణారావును కూడా పాలకవర్గం సత్కరించింది. బ్యాంకు ఉపాధ్యక్షుడు ఎం.రాఘవరావు, డైరెక్టర్లు వి.చంద్రశేఖర్, పి.వి.నరసింహమూర్తి, జేవీ సత్యనారాయణమూర్తి, సూరపనేని నాగభూషణ చౌదరి, ఏజే స్టాలిన్, ఉన్నతాధికారులు, వివిధ శాఖల మేనేజర్లు, సిబ్బంది, ఖాతాదారులు పాల్గొన్నారు.