డాబాగార్డెన్స్: అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యల రెండు సంస్థల విలీన సభ సందర్భంగా ఆదివారం డాబాగార్డెన్స్లోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో సాహిత్య సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాశీం మాట్లాడుతూ గత 50 ఏళ్లుగా విప్లవ సాంస్కృతికోద్యమ నిర్మాణంలో భాగమైన రెండు సంఘాల విలీనం అవసరమన్నారు. మార్క్సిజం, లెనినిజం, మావోయిజం భావాలున్న వారు ఐక్యమవ్వాల్సిన అవసరం ఉందని, రాజకీయ కార్యాచరణ ద్వారానే ఇది సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో కార్పొరేట్ మనువాదం, సామ్రాజ్యవాదం పెరిగిపోతున్నాయని, మోదీ ప్రభుత్వం ప్రశ్నించే వారిని అణచివేస్తోందని ప్రొఫెసర్ కాశీం విమర్శించారు. ఇటువంటి తరుణంలో కళాకారులు ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత ఉందని, ఆ దిశగా అరుణోదయ కళాకారులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రైటర్స్ అకాడమీ చైర్మన్ వీవీ రమణమూర్తి మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకోవాలని, మందసలో ఎయిర్పోర్టు రాకుండా రైతుల భూములను రక్షించాలని కోరారు. తెలంగాణ అరుణోదయ రాష్ట్ర అధ్యక్షుడు వేణు మాట్లాడుతూ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పక్కనబెట్టి మోదీ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు. సభాధ్యక్షుడు నాగరాజు అమర కళావీరులను స్మరిస్తూ తీర్మానం చేశారు. ముందుగా సరస్వతి పార్క్ నుంచి సభావేదిక వరకు అరుణోదయ కళాకారుల కళా ప్రదర్శన ఆటపాటలతో సాగింది. కార్యక్రమంలో తెలంగాణ అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సున్నశెట్టి రాజశేఖర్, రాష్ట్ర కార్యదర్శి అంజయ్య, కె నిర్మల, ఎస్.జయలక్ష్మి, పీవోడబ్ల్యూ రాష్ట్ర నాయకురాలు ఎం.లక్ష్మి, ఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకుడు వెంకటేశ్వర్లు, న్యాయవాది చలం అధిక సంఖ్యలో కళాకారులు పాల్గొన్నారు.