
తారస్థాయిలో పైరవీలు
● నేటితో ముగియనున్న ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ● కూటమి ఎమ్మెల్యేల నుంచి భారీగా సిఫార్సు లేఖలు ● పోస్టును బట్టి ధర నిర్ణయించినట్టు ప్రచారం
మహారాణిపేట: ఉద్యోగుల బదిలీలకు గడువు సోమవారంతో ముగియనుండడంతో పైరవీలు తారస్థాయికి చేరుకున్నాయి. రెండు చేతులా డబ్బులు వచ్చే స్థానాల కోసం ఉద్యోగులు కూటమి ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో పోస్టును బట్టి, మండలం/జిల్లాను బట్టి రేట్లు నిర్ణయించి బేరసారాలకు దిగుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సిఫార్సు లేఖల జారీకి ముందు ధరలు నిర్ణయించారని ప్రచారం జరుగుతోంది.
కీలక పోస్టులకు డిమాండ్
ప్రధానంగా తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఇరిగేషన్, గ్రామీణ నీటి సరఫరా విభాగాల ఇంజినీర్ల పోస్టులకు సిఫార్సు లేఖల కోసం తీవ్ర పోటీ నెలకొంది. భీమిలి, విశాఖ రూరల్, ఆనందపురం, పెందుర్తి, సీతమ్మధార తహసీల్దార్ పోస్టులకు మంచి గిరాకీ ఉందని, ఈ స్థానాల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు రెవెన్యూ వర్గాల్లో చర్చ జరుగుతోంది. విశాఖలో ఏళ్ల తరబడి తిష్టవేసిన వారు ఇక్కడి నుంచి కదలకుండా, గ్రామీణ ప్రాంతాల వారు నగరంలో పోస్టింగ్ కోసం ప్రయత్నిస్తున్నారు.
పాలనాపరమైన ప్రయత్నాలు
ఇటీవల ఉమ్మడి విశాఖ జిల్లాల కలెక్టర్ల సమావేశంలో తహసీల్దార్ల బదిలీలపై ప్రధానంగా చర్చించారు. విశాఖలో పనిచేస్తున్న వారిని ఏజెన్సీకి, అక్కడ పని చేస్తున్న వారిని విశాఖకు బదిలీ చేసే ప్రతిపాదనలు పరిశీలించారు. అలాగే కొందరు విశాఖ తహసీల్దార్లను ఇతర ప్రాంతాలకు పంపాలని విశాఖ కలెక్టర్ యోచిస్తున్నట్లు సమాచారం.
సిఫార్సు లేఖల వెల్లువ
రెవెన్యూ శాఖలో అన్ని కేడర్ల బదిలీల కోసం కూటమి ఎమ్మెల్యేల నుంచి 132 సిఫార్సు లేఖలు కలెక్టరేట్కు అందినట్లు తెలుస్తోంది. జిల్లా పరిషత్లో ఎంపీడీవోలు, ఇతర ఉద్యోగుల బదిలీలకు కూడా లేఖలు అందాయి. మొత్తం 68 వ్యక్తిగత దరఖాస్తులు కూడా రాగా, మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి సిఫార్సులు, ఫోన్ కాల్స్ పెద్ద సంఖ్యలో వస్తున్నట్లు సమాచారం. అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పని చేస్తున్న తహసీల్దార్లు కూడా విశాఖలో పోస్టింగ్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.