
విశాఖలో ట్రాఫిక్ కష్టాలకు ‘అస్త్రం’
● ప్రజల రవాణా కష్టాలకు చెక్ ● యాప్ ప్రారంభించిన హోం మంత్రి అనిత
అల్లిపురం: విశాఖపట్నంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు పోలీసులు రూపొందించిన ‘అస్త్రం’ యాప్ను రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ఆదివారం ఆవిష్కరించారు. నగర పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, విశాఖ ఆర్థిక రాజధానిగా ఎదుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ కష్టాలు తనకు తెలుసునని చెప్పారు. ‘అస్త్రం’ యాప్ ప్రజలకు ఉపయోగపడేలా, ‘పబ్లిక్ ఫ్రెండ్లీ’గా తీర్చిదిద్దినట్లు తెలిపారు. ఈ యాప్ ద్వారా ట్రాఫిక్ జామ్స్, క్లియరెన్స్ సమయం, ప్రత్యామ్నాయ మార్గాల వివరాలు తెలుసుకోవచ్చని చెప్పారు. ఇది ట్రాఫిక్ సిబ్బందికి కూడా సమన్వయంతో పనిచేయడానికి ఉపయోగపడుతుందన్నారు. యాప్తో నగరంలో ట్రాఫిక్ కష్టాలకు దాదాపుగా చెక్ పెట్టవచ్చని, నగర ప్రజలు గమ్య స్థానాలకు సురక్షితంగా చేరేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుం దన్నారు. టెలిగ్రామ్ ద్వారా డౌన్లోడ్ చేసుకోగల ఈ యాప్ మూడు నెలల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని హోం మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె ట్రాఫిక్ సిబ్బందికి ఏసీ హెల్మెట్లు అందజేసి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి, డీసీపీలు అజిత వేజెండ్ల, ప్రశాంతి, ట్రాఫిక్ ఏడీసీపీ తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.