రంగంలోకి రేషన్‌ మాఫియా | - | Sakshi
Sakshi News home page

రంగంలోకి రేషన్‌ మాఫియా

Jun 3 2025 6:48 AM | Updated on Jun 3 2025 6:48 AM

రంగంలోకి రేషన్‌ మాఫియా

రంగంలోకి రేషన్‌ మాఫియా

● రేషన్‌ డిపోలు తెరవగానే బియ్యం మాయం ● విశాఖలో రెండుచోట్ల రేషన్‌ బియ్యం అక్రమ రవాణాకు బ్రేక్‌ ● 3,999 కిలోల బియ్యం స్వాధీనం చేసుకున్న పోలీసులు

విశాఖ సిటీ/ఎంవీిపీ కాలనీ: రేషన్‌ డిపోలు ప్రారంభించిన రెండో రోజే రేషన్‌ మాఫియా మళ్లీ పురివిప్పింది. పేదల కోసం ఉద్దేశించిన బియ్యాన్ని బ్లాక్‌ మార్కెట్‌కు తరలించడానికి సిద్ధమైంది. రైల్వే న్యూకాలనీలో 1,509 కిలోలు, ఇసుకతోట కూడలిలో అక్రమంగా తరలిస్తున్న 2,490 కిలోల బియ్యం తరలిస్తున్న ముఠాకు పోలీసులు చెక్‌ పెట్టారు. గత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం వృద్ధులు, దివ్యాంగులు, మహిళలకు ఇబ్బందులు లేకుండా ‘ఇంటింటి రేషన్‌’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఎండీయూ వాహనాల ద్వారా నిత్యావసరాలను ఇంటి వద్దకే అందించింది. ఇది కార్డుదారులకే కాకుండా నిరుద్యోగ యువతకు కూడా ఉపాధి కల్పించింది. ఎన్నికలకు ముందు చంద్రబాబు బియ్యం కార్డుదారులకు కందిపప్పు, గోధుమపిండి, చోడిపిండి, వంటనూనె వంటి నిత్యావసరాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చాక ఇంటింటి రేషన్‌ విధానానికి స్వస్తి పలికి, మళ్లీ పాత విధానంలో రేషన్‌ డిపోల్లోనే నిత్యావసరాలు అందించేలా ఉత్తర్వులు జారీ చేశారు.

డిపోలపై అనుమానాలు..

రేషన్‌ డిపోలలో సరుకులు ఇవ్వడంతో కార్డుదారులకు పాత కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. కిలోమీటర్లు ప్రయాణించి, గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి బియ్యం, పంచదార కోసం అవస్థలు పడాల్సి వస్తోంది. ఈ నెల 1వ తేదీ నుంచి ప్రారంభించిన ఈ ప్రక్రియ ప్రహసనంగా మారింది. కొత్త పథకాన్ని ప్రవేశపెట్టినట్లు ప్రభుత్వం ప్రజాప్రతినిధులు, కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ సమక్షంలో అట్టహాసంగా ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేపట్టింది. అయితే తొలి రోజే సర్వర్‌ పనిచేయకపోవడం, నిత్యావసరాల పంపిణీలో ఇబ్బందులు తలెత్తడంతో కార్డుదారులతో చీవాట్లు తినాల్సి వచ్చింది. మూడో రోజు సోమవారం కూడా అదే పరిస్థితి నెలకొంది. రేషన్‌ డిపోల ద్వారా నిత్యావసరాలు పక్కదారి పట్టే అవకాశాలు ఉన్నాయన్నది బహిరంగ రహస్యం. గతంలో చౌక దుకాణాల నుంచి టన్నులకు టన్నుల బియ్యం బ్లాక్‌ మార్కెట్‌కు తరలిపోయిన సందర్భాలు అనేకమున్నాయి. తాజాగా అదే విధానంలో మళ్లీ సరుకుల పంపిణీని చేపట్టడంతో బియ్యం, పంచదార బ్లాక్‌ మార్కెట్‌కు వెళ్లిపోతుందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అందరూ ఊహించినట్లుగానే, రేషన్‌ డిపోల ద్వారా సరుకులు పంపిణీ చేపట్టిన మూడో రోజే బియ్యం అక్రమ రవాణా మాఫియా రంగంలోకి దిగింది. చౌక దుకాణ బియ్యాన్ని బ్లాక్‌ మార్కెట్‌కు తరలించేందుకు సిద్ధమైపోయింది. రైల్వే న్యూకాలనీలో గుట్టుచప్పుడు కాకుండా బియ్యాన్ని తరలిస్తుండగా నాలుగో పట్టణ పోలీసులు వాహనాన్ని పట్టుకున్నారు. బియ్యాన్ని తరలిస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకుని 1,509 కిలో చౌక బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి ఇసుకతోట కూడలిలో అక్రమంగా తరలిస్తున్న 2,490 కేజీల పీడీఎస్‌ బియ్యం ఎంవీపీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహన డ్రైవర్‌ను అరెస్టు చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు.

ఉమ్మడి విశాఖ జిల్లాలో..

విశాఖలోనే కాకుండా, అనకాపల్లి జిల్లాలోని దేవరాపల్లి మండలం ఏ.కొత్తపల్లి రేషన్‌ డిపోపై విజిలెన్స్‌, పౌర సరఫరా అధికారులు దాడులు చేయగా, 764 కేజీల బియ్యం, 25 ప్యాకెట్ల పంచదార అదనంగా ఉన్నట్లు గుర్తించారు. కార్డుదారులకు సరుకులు ఇవ్వకుండానే బయోమెట్రిక్‌ వేయించుకుని డిపోల నిర్వాహకులు అప్పుడే అక్రమాలకు తెరలేపినట్లు ఈ ఘటనలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ బియ్యాన్ని బ్లాక్‌ మార్కెట్‌లో రూ.30కి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. తనిఖీలు చేపట్టిన రెండు చోట్ల అక్రమాలు, అవకతవకలు బయటపడ్డాయి. ఇతర డిపోల్లో కూడా తనిఖీలు చేపడితే మరింత మంది లీలలు బయటపడతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement