తాండూరు: ఆస్తి మార్పిడి విషయంలో రెవెన్యూ అధికారుల అవినీతి లీలలు ఆశ్చర్యపరుస్తున్నాయి. కాసులు దండుకునే క్రమంలో అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా రూ.కోట్లవిలువైన భూమికి తామే వారసులమంటూ సంబంధం లేని వ్యక్తులు నకిలీ పత్రాలతో దరఖాస్తు చేసుకున్న మ్యుటేషన్కు ఆమోదముద్ర వేశారు. విషయం తెలుసుకున్న అసలు వారసులు కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో భూ బాగోతం బయట పడింది.
ఇదీ జరిగింది..
తాండూరు పట్టణానికి చెందిన ఖాసీం అలీకి మండలంలోని చెంగోల్ గ్రామ పరిధి సర్వే నంబర్ 141/ఏఏ, 142/ఏ, 143/01, 200, 212లో 11.08 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి. కొన్నేళ్ల క్రి తం ఆయన మరణించారు. అతని కుమారులు అక్బ ర్ అలీ, జాఫర్ నవాజ్ హైదరాబాద్లో ఉంటున్నా రు. తండ్రి పేరిట ఉన్న భూమిని తమ పేరిట మార్పిడి చేయాలని కుమారులు పలుమార్లు అర్జీలు పెట్టు కున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదు. ఇది లా ఉండగా ఖాసీం అలీ వారసులంటూ మహబూబ్బీ, పింజారి బేబి, మహ్మద్ రఫీ, పింజారి సనాబేగం, మహ్మద్ కుద్బుద్దీన్, మహబూబ్సాబ్ తోపాటు మరో ఇద్దరు 2024లో చెంగోల్ గ్రామ సర్వే నంబర్ల 200, 212లోని 4.20 ఎకరాల భూమిని తమ పేరిట మార్చాలని అర్జీ సమర్పించారు. విషయం తెలుసుకున్న అసలు వారసులు అప్పట్లో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో రిజిస్ట్రేషన్ ఆగిపోయింది.
నాడు తిరస్కరించి..
2024లో ఖాసీం అలీకి చెందిన 4.20 ఎకరాల భూమిని తమ పేరిట మార్చాలని అక్రమార్కులు తహసీల్దార్కు దరఖాస్తు చేయడంతో మ్యుటేషన్ చేశారు. అసలు వారసులు అప్పట్లో కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో మ్యుటేషన్ రద్దయింది. రెండేళ్ల తర్వాత అదే తహసీల్దార్ ఆర్డీఓ కార్యాలయంలోని ఓ రెవెన్యూ అధికారితో కుమ్మకై ్క తప్పుడు పత్రాల ఆధారంగా చెంగోల్ గ్రామ సర్వే నంబర్ 200లోని 2.19 ఎకరాలు, సర్వే నంబర్ 212లోని 2.08 ఎకరాల భూమిని మే 29న మహబూబ్బీ పేరిట మ్యుటేషన్ చేశారు. ఈ ప్రక్రియ పూర్తి కాగానే సదరు భూమిని మూడో వ్యక్తికి విక్రయించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అధికారులు, రాజకీయ నేతలు కుమ్మకై ్క విలువైన భూములను కాజేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
కలెక్టర్కు ఫిర్యాదు
తమ తండ్రి పేరిట ఉన్న భూమిని గత నెల 29న ఆర్డీఓ నుంచి అనుమతులు పొంది తాండూరు తహసీల్దార్ థారాసింగ్ మహబూబ్బీ పేరిట రిజిస్ట్రేషన్ చేశారని ఖాసీం అలీ కుమారులు అక్బర్ అలీ, జాఫర్అలీ ఈ నెల 18న కలెక్టర్ దీపక్ తివారికి ఫిర్యాదు చేశారు. మహబూబ్బీ భర్త గోరేసాబ్ను వారసురాడిగా గుర్తిస్తూ ఖాతా నంబర్ 60795తో పట్టాదారురాలిగా భూమి హక్కులు కల్పించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కలెక్టర్ తాండూరు రెవెన్యూ అధికారులను వివరణ కోరుతూ మెమో జారీ చేసినట్లు తెలిసింది.
నకిలీ పత్రాలు సృష్టించి 4.20 ఎకరాల భూమికి తప్పుడు మ్యుటేషన్
అక్రమార్కులతో కుమ్మకై ్కనపలువురు రెవెన్యూ అధికారులు
చెంగోల్ పరిధిలో అవినీతి బాగోతం
కలెక్టర్కు ఫిర్యాదు చేసిన బాధితులు
మ్యుటేషన్ను రద్దు చేస్తాం
నిజమైన వారసులు అనుకుని చెంగోల్ సర్వే నంబర్ల 200, 21లోని ఖాసీం అలీ భూమిని మ్యుటేషన్ చేశాం. పని ఒత్తిడి కారణంగా ఈ పొరపాటు జరిగింది. గతంలో తిరస్కరించిన విషయం గుర్తుకు రాలేదు. నకిలీ పత్రాలు సమర్పించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తాం. మహబూబ్బీకి చేసిన మ్యుటేషన్ను రద్దు చేస్తాం.
– థారాసింగ్, తహసీల్దార్, తాండూరు
చర్యలు తీసుకుంటాం
చెంగోల్ రెవెన్యూ పరిధిలో నకిలీ పత్రాలు సృష్టించి వారసత్వ హక్కులు పొందినట్లు మా దృష్టికి వచ్చింది. దీనిపై సమగ్ర విచారణ జరిపించి కలెక్టర్కు నివేదిక సమర్పిస్తాం. తప్పుడు మ్యుటేషన్ను ప్రోత్సహించిన అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం.
– అనిత, ఆర్డీఓ, తాండూరు


