● నిందితుడికి 78 కేసులలో ప్రమేయం
● 62 గ్రాముల బంగారం, 270 గ్రాముల వెండి ఆభరణలు స్వాధీనం
పహాడీషరీఫ్: ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న ఓ కరుడుగట్టిన నేరస్తుడిని బాలాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి శుక్రవారం రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ ఎం.సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. షాహిన్నగర్ అలైన్ కాలనీకి చెందిన మహ్మద్ సలీం అలియాస్ సునీల్ శెట్టి(52)కి రాత్రిపూట తాళం వేసి ఉన్న ఇళ్లను గుల్ల చేయడం వెన్నతో పెట్టిన విద్య. ఇటీవల బాలాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని వెంకటాపూర్ గ్రామం, అలైన్ హిల్స్, వాదే ముస్తఫా బస్తీలలో ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డాడు. పహాడీషరీఫ్ ఠాణా పరిధిలో మూడు, మీర్పేటలో ఒకటి, ఫలక్నుమాలో ఒక చోరీ చేశాడు. శుక్రవారం అనుమానాస్పద స్థితిలో తచ్చాడుతున్న అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించడంతో దొంగతనాల చిట్టా విప్పాడు. ఇతనిపై ఇప్పటి వరకు 78 దొంగతనాలకు సంబంధించిన కేసులు నమోదై ఉండడం విశేషం. నిందితుడి వద్ద నుంచి 62 గ్రాముల బంగారు, 270 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.


