దోమ: పని ప్రదేశంలో ఫీల్ట్ అసిస్టెంట్, పంచాయతీ కార్యదర్శి తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఉపాధి హామీ పథకం కూలీలు ఆందోళనకు దిగారు. గురువారం మండలంలోని మోత్కూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పనులు సవ్యంగా జరుగుతున్నా కావాలనే వేధిస్తున్నారని వాపోయారు. ఫొటో క్యాప్చర్ కావడం లేదని ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉంచుతున్నారని తెలిపారు. పనుల్లో నాణ్యత పాటించడం లేదని, సరైన కొలతలు తీయడం లేదని ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. ఫీల్ట్ అసిస్టెంట్, పంచాయతీ కార్యదర్శి తీరు కారణంగా తాము పనులు చేయలేక పోతున్నామని పేర్కొన్నారు. అధికారులు చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి రవీందర్రెడ్డిని వివరణ కోరగా.. సర్వర్ సమస్యలతో ఫొటో క్యాప్చర్ కావడం లేదని తెలిపారు. కూలీలు నిర్వహిస్తున్న పనుల్లో సరైన కొలతలు పాటించడం లేదన్నారు. ఇలా చేయడం ద్వారా డబ్బులు అనుకున్న మేర రావని చెబుతున్నా వారు పట్టించుకోవడం లేదని తెలిపారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు.
పని ప్రదేశంలో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన
ఫీల్ట్ అసిస్టెంట్, పంచాయతీ కార్యదర్శి తీరుపై ఆగ్రహం
ఉన్నతాధికారులుస్పందించాలని విన్నపం


