
రేణుక ఎల్లమ్మ ఆలయంలో హుండీ లెక్కింపు
తాండూరు రూరల్: మండల పరిధి కొత్లాపూర్ శివారులో ఉన్న రేణుక ఎల్లమ్మ ఆలయంలో మే మొదటి వారం నుంచి జూన్ 13న ఏరువాక పౌర్ణమి వరకు జాతర కొనసాగింది. బుధవారం ఆలయ కమిటీ, దేవాదాయ శాఖ అధికారులు హుండీ లెక్కించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ నవీన్చందర్రెడ్డి, ఈఓ శేఖర్ మాట్లాడుతూ.. రూ.4.47లక్షల ఆదాయం వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ డైరెక్టర్లు రాజు, లాలయ్యగౌడ్, లక్ష్మి, లాల్య నాయక్, శాంతప్ప, ఈశ్వరమ్మ, పరిశీలకులు శాంత్కుమార్, సిబ్బంది రవి, గ్రామస్తులు రేణుక తదితరులు పాల్గొన్నారు.
పెంచిన బస్పాస్ చార్జీలు తగ్గించాలి
తాండూరు టౌన్: పెంచిన స్టూడెంట్ బస్పాస్ చార్జీలను వెంటనే తగ్గించాలని కోరుతూ.. ఏబీవీపీ నాయకులు బుధవారం ఆర్టీసీ తాండూరు డిపో మేనేజర్ సంతోశ్కుమార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి విద్యార్థులు పట్టణ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులో వచ్చి వెళ్తుంటారని.. వారి బస్పాస్ చార్జీలు పెంచడంతో భారమైందన్నారు. పలువురు చదువుకు దూరమవుతున్నారన్నారు. వెంటనే బస్పాస్ చార్జీలు పెంచకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అజయ్, జిల్లా కన్వీనర్ హరీశ్రావు, ఆకాశ్, ఆర్యన్, రాకేశ్ తదితరులు హెచ్చరించారు.
ప్రభుత్వ కళాశాలలోనే చేరండి
ఇంటర్మీడియెట్ జిల్లా విద్యాధికారి శంకర్నాయక్
దౌల్తాబాద్: పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు నూతనంగా ఏర్పడిన ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనే చేరాలని ఇంటర్మీడియెట్ జిల్లా విద్యాధికారి శంకర్నాయక్ అన్నారు. బుధవారం ఆయన స్థానిక ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శంకర్నాయక్ మాట్లాడుతూ.. ప్రభుత్వ కళాశాలలో చదివిన విద్యార్థులే ఉన్నత శిఖరాలను అధిరోహించారని.. ఉన్నత లక్ష్యాలను పెట్టుకుని రాణించాలని సూచించారు. కళాశాలకు 12 అధ్యాపక పోస్టులు మంజూరయ్యాయని వివరించారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ ఇంగ్లిష్, తెలుగు మీడియం కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ వెంకట్స్వామి, జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం శ్రీహరిరెడ్డి తదితరులున్నారు.
నాణ్యమైన విద్యుత్ కోసం బీఆర్ఎస్ ధర్నా
ఆమనగల్లు: వ్యవసాయానికి కోతలు లేకుండా, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం పలువురు రైతులతో కలిసి గట్టుప్పలపల్లి సబ్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. చిన్నపాటి వర్షం కురిసినా, గాలివీచినా గంటల తరబడి సరఫరా నిలిపేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు పాల్గొన్నారు.

రేణుక ఎల్లమ్మ ఆలయంలో హుండీ లెక్కింపు

రేణుక ఎల్లమ్మ ఆలయంలో హుండీ లెక్కింపు