
పంద్రాగస్టులోగా పరిష్కారం చూపండి
కొడంగల్: భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో రైతులు దరఖాస్తులు చేసుకున్న సమస్యలకు పంద్రాగస్టులోగా పరిష్కారం చూపాలని తాండూరు సబ్–కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ అన్నారు. బుధవారం ఆయన కొడంగల్ తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఉద్యోగులతో భూ భారతి దరఖాస్తులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల పరిధిలోని 18 రెవెన్యూ గ్రామాల్లో నిర్వహించిన భూ భారతి సదస్సుల్లో 348 మంది రైతులు భూ సమస్యలపై దరఖాస్తులు సమర్పించారని.. ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ఆగస్టు 15 లోగా సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో తహసీల్దార్ విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
‘ఐఐటీ పేరుతో దందా’..
తాండూరు టౌన్: ఇంటర్ బోర్డు నిబంధనలకు విరుద్ధంగా పట్టణంలోని భాష్యం జూనియర్ కళాశాలలో ఐఐటీ, నీట్ కోచింగ్ పేరుతో కొనసాగుతున్న దందాను అడ్డుకోవాలని ప్రజా, విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం వారు తాండూరు సబ్–కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనివాస్ మాట్లాడుతూ ఇంటర్ సాధారణ తరగతులు నిర్వహిస్తున్న కళాశాలలో ఐఐటీ, నీట్, సీఏ, సీపీటీ బోధిస్తామని సంకల్ప్ ఏసీ అకాడమీ పేరుతో కోచింగ్ సెంటర్ నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమన్నారు. ఈ కోచింగ్ పేరిట విద్యార్థుల నుంచి రూ.60 నుంచి రూ.70వేలు వరకు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఎలాంటి అనుమతులు లేకుండా కళాశాలలో కోచింగ్ సెంటర్ నిర్వహించడం సరికాదన్నారు. పేద, మధ్య తరగతి విద్యార్థులను కోచింగ్ పేరిట మోసగిస్తున్న భాష్యం కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేని ఎడల ఉన్నత విద్యా మండలికి ఫిర్యాదు చేయడంతో పాటు విద్యార్థి, ప్రజా సంఘాలతో కలిసి కళాశాల ఎదుట ఆందోళన చేస్తామన్నారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో కేఎన్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చంద్రప్ప, స్వేరో జిల్లా ఉపాధ్యక్షుడు శివకుమార్ ఉన్నారు.
తాండూరు సబ్–కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్