
కుదురుమల్ల నుంచే కాంగ్రెస్ పతనం
దుద్యాల్: కుదురుమల్ల నుంచే కాంగ్రెస్ పతనం ప్రారంభమని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. బుధవారం గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నుంచి పలువురు కార్యకర్తలు గులాబీ గూటికి చేరారు. మండల పరిధిలోని గౌరారం గ్రామంలో ఓ ఫాంహౌస్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నరేందర్రెడ్డి వారికి కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో విసిగిన ప్రజలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలుకు నోచుకోవడం లేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఓట్లు వస్తేనే రైతులు గుర్తుకు వస్తారన్నారు. యాసంగి రైతు భరోసాకు లేని నిధులు స్థానిక సంస్థల ఎన్నికల ముందు వానాకాలం పంటలకు ఎలా వచ్చాయో చెప్పాలన్నారు. ప్రభుత్వ పథకాలన్నీ పార్టీ నేతలకే అందిస్తున్నారని ఆరోపించారు. ఓట్లు అడిగేందుకు వచ్చిన కాంగ్రెస్ నాయకులు గ్యారంటీ కార్డు చూపి నిలదీయాలన్నారు. కుదురుమల్ల గ్రామానికి చెందిన మడిగ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇంత మంది పార్టీలో చేరడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో దుద్యాల్, బొంరాస్పేట్, దౌల్తాబాద్, కొడంగల్ మండల అధ్యక్షులు చాంద్ పాషా, యాదగిరి, మహిపాల్, దామోదర్రెడ్డి, యూత్ అధ్యక్షుడు బొగమోని సురేశ్, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు నరేశ్ గౌడ్, నాయకులు మధుసూదన్ యాదవ్, నారాయణరెడ్డి, బుగ్గప్ప, బాబర్, రమేశ్ బాబు, కేశరెడ్డి, రవి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి
గులాబీ గూటికి చేరినహస్తం, బీజేపీ శ్రేణులు