ఏర్పేడు: శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మట్టి మాఫియా చెలరేగిపోతోంది. ప్రైవేటు రియల్ వెంచర్లకు టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా మట్టిని తోలుకుని అక్రమార్జనకు తెగబడుతోంది. మండలంలోని మాధవమాల చెరువులో పది రోజులుగా కీలక నేత అనుచరులు చెరువులో జేసీబీలు పెట్టి ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నారు. దీనిపై స్థానిక టీడీపీ నాయకులే అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామంలో మట్టి మాఫియా ఆగడాలపై గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు చంద్రారెడ్డి స్థానికులతో కలసి సోమవారం జిల్లా కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే మండలంలోని గుడిమల్లం చెరువును పూర్తిగా గోతులమయం చేసేశారు. అయితే నిలువరించాల్సిన ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు అధికార ఒత్తిళ్లకు తలొగ్గి ప్రేక్షకపాత్ర వహిస్తుండడం గమనార్హం.


