రేణిగుంట: మండలం వెద్దల్ల చెరువులోని పెద్ద చెరువులో నూతన హైవే పేరుతో విచ్చలవిడిగా మట్టి తవ్వకాలు చేస్తున్నారు. అధికారుల అనుమతులు ఉన్నాయని చెబుతూ ఇష్టానుసారంగా చెరువును హిటాచీలతో ధ్వంసం చేస్తూ మట్టిని లూటీ చేస్తున్నారు. హిటాచీలతో ఇష్టం వచ్చిన లోతు మట్టి ఎత్తుతూ పెద్ద పెద్ద గుంతలు చేస్తున్నారని స్థానిక రైతులు వాపోతున్నారు. ఈ విధంగా చెరువును విచ్చలవిడిగా ధ్వంసం చేయడం వల్ల వ్యవసాయానికి చెరువు నీళ్లు అందక ఇబ్బందులు పడే పరిస్థితులు ఏర్పడతాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. హైవే పేరు చెప్పుకొని టిప్పర్లతో ప్రైవేట్ వెంచర్లకు మట్టిని తరలిస్తున్నారని, అంతా అధికారులకు తెలిసే జరుగుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడం చూస్తే మట్టి అక్రమ తవ్వకాల్లో అధికారుల పాత్ర ఉందేమోననే అనుమానాలు కలుగుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు.


