తిరుచానూరులో మూడు రోజుల ఎగ్జిబిషన్
తిరుపతి అర్బన్: దేశసంస్కృతి, సంప్రదాయలకు అద్దం పట్టేలా దశాబ్దాల క్రితం ముద్రించిన వివిధ దేశాల కరెన్సీ నోట్లతో పాటు స్టాంపులు, నాణేల ప్రదర్ళన కార్యక్రమాన్ని తిరుచానూరులోని శ్రీబాలాజీ కల్యాణ మండపంలో చేపట్టారు. శుక్ర, శని, ఆదివారం మూడు రోజుల పాటు ఫిలాటెలిక్ న్యూమస్ మేటిస్ట్ అసోషియేషన్(తపనా) అధ్యక్ష, కార్యదర్శి చంద్రశేఖర్, కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తొలిరోజు శుక్రవారం పెద్ద ఎత్తున ఆదరణ లభించింది. పురాతన నాణేలను, స్టాంపులను, కరెన్సీ నోట్లను ప్రదర్శన చేపట్టడంతోపాటు ఆసక్తి ఉన్నవారి కోసం వాటిని విక్రయించారు. ఏడు దశాబద్దాలుగా భారత ప్రభుత్వం ముద్రించిన 127 నాణేలతోపాటు పలు దేశాలకు చెందిన కరెన్సీలు, స్టాంపులు, నాణేలను నామమాత్రపు ధరలతో ఎగ్జిబిషన్కు విచ్చేసిన వారు కొనుగోలు చేయడానికి వీలుగా ఉంచారు. తమకు ఇష్టమైన పలు దేశాలకు చెందిన కరెన్సీతో పాటు డాలర్, పౌండ్, పెసా తదితర నోట్లను పలువురు కొనుగోలు చేశారు. ఈ ప్రదర్శన మరో రెండు రోజులపాటు కొనసాగనుంది.


