తిరుపతి అర్బన్: బిందు, తుంపర్ల సేద్యం సంబంధిచి రైతులకు రాయితీ పరికరాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా సూక్ష్మ సేద్య అధికారి చిన్న రెడ్డెయ్య గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. అయితే మామిడి, బత్తాయి, నిమ్మ, సపోట, బొప్పా యి, అరటి పంటలకు మాత్రమే డ్రిప్ పరికరాలకు రాయితీ ఉంటుందని చెప్పారు. 5 ఎకరాల లోపు ఉన్న ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం రాయితీ ఉంటుందని, 5ఎకరాలు పైబడి ఎస్సీ, ఎస్టీ రైతులకు 90 శాతం రాయితీ ఉంటుందని చెప్పారు. అలాగే 10 ఎకరాలు లోపు ఉన్న ఇతర కులాల రైతులకు 90 శాతం, 10 ఎకరాలు పైబడి రైతులకు 50 శాతం మాత్రమే రాయితీ ఉంటుందన్నారు. అలాగే స్ప్రింక్లర్లకు సంబంధించి వేరుశనగ, పెసరు, మినుములు తదితర పంటలకు మాత్రం ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ 50శాతం రాయితీ ఉంటుందని స్పష్టం చేశారు. జిల్లాకు 6,500 హెక్టర్లకు రాయితీ పరికరాలు మంజూరు చేయనున్నట్టు ఆయన వివరించారు.
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల:తిరుమలలో గురువారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బుధవారం అర్ధరాత్రి వరకు 70,139 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 34,940 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.63 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.


