తిరుమల: తిరుమలలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన ఫుడ్ అండ్ వాటర్ అనాలిసిస్ ల్యాబ్ అందుబాటులోకి వచ్చినట్లు టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్యచౌదరి తెలిపారు. గురువారం ఆయన తిరుమలలోని ల్యాబ్ను సందర్శించి, తొలి అనాలిసిస్ రిపోర్ట్ను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ, శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల ఆరోగ్య భద్రతకు టీటీడీ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కేవలం రెండున్నర నెలల్లోనే అన్ని ప్రమాణాలను పూర్తి చేసి, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్ఓపీ) మేరకు పరీక్షలు నిర్వహించి తొలి రిపోర్ట్ సిద్ధం చేయడం విశేషమన్నారు. ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రమాణాలకు అనుగుణంగా ఏర్పాటు చేసిన ఈ ల్యాబ్లో 50కి పైగా అత్యాధునిక పరికరాలు ఉన్నాయన్నారు. 30 మంది శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, ల్యాబ్ టెక్నీషియన్లు సేవలందిస్తున్నారని చెప్పారు. త్వరలో ప్రభుత్వ అనుమతి మేరకు 20 మంది శాశ్వత ఉద్యోగులను నియమించనున్నట్లు వెల్లడించారు. రోజూ తిరుమలలోని వివిధ వంటశాలలు, అన్నప్రసాద కేంద్రాల నుంచి సుమారు 40 ఆహార నమూనాలు, అలాగే జలప్రసాదం, వాటర్ లైన్ల నుంచి 20 నీటి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఆరోగ్య విభాగం డిప్యూటీ ఈవో సోమన్నారాయణ, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ల్యాబ్ క్వాలిటీ మేనేజర్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.


