తిరుపతి మంగళం : ప్రజలకు విశేష సేవలందించడంలో తిరుపతి జిల్లా రవాణాశాఖ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండడం గర్వకారణమని జిల్లా రవాణాశాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ తెలిపారు. తిరుపతి జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో మంగళవారం విశేష సేవలందించిన మోటారు వాహన తనిఖీ అధికారులు చంద్రశేఖర్, దామోదర్నాయుడును ఆయన ఘనంగా సత్కరించి, మెమెంటోలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. తిరుపతి జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో ప్రభుత్వ సేవలపై ప్రజల అభిప్రాయాలను అంచనా వేయడానికి నిర్వహించిన ఫీడ్బ్యాక్ వ్యవస్థలో తిరుపతి జిల్లా రవాణాశాఖ రాష్ట్రంలో వరుసగా రెండు సార్లు ప్రథమ స్థానం పొందడం విశేషమన్నారు. అందులో పుత్తూరు మోటారు వాహన తనిఖీ అధికారి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పుత్తూరు మోటార్ వాహనాల తనిఖీ అధికారి కార్యాలయం గత రెండు నెలలుగా వందశాతం పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ నమోదయ్యిందని, అలాగే శ్రీకాళహస్తి మోటారు వాహన తనిఖీ అధికారి దామోదరనాయుడు ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి కార్యాలయం 96శాతం పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ నమోదయిందని తెలిపారు. ఎంవీఐలు సుబ్రమణ్యం, శ్రీనివాసరావు, అతికానాజ్, స్వర్ణలత, ఏవోలు, సిబ్బంది పాల్గొన్నారు.
ఎన్ఎస్యూలో ప్రవేశాలకు రేపే తుది గడువు
తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత వర్సిటీలో పలు కోర్సుల్లో ప్రవేశాలకు కోసం దరఖాస్తు చేసుకోవడానికి గురువారంతో గడువు ముగియనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. పాక్శాస్త్రి కోర్సులతో పాటు, యూజీ(శాస్త్రి) 3, 4 సంవత్సరాల కోర్సుల్లోనూ, అలాగే 17 విభాగాల్లో పీజీ (ఆచార్య) 1, 2 సంవత్సరాల కాలవ్యవధి కోర్సుల్లోనూ, పీహెచ్డీ (విద్యావారధి) కోర్సుల్లోనూ ప్రొఫెషనల్ కోర్సులైన ఐటీఈపీ (బీఏ, బీఈడీ), బీఈడీ (శిక్షా శాస్త్రి), ఎమ్ఈడీ (శిక్షా ఆచార్య) కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తుల గడువు గురువారంతో ముగియనుందని తెలిపారు. మరిన్ని వివరాలకు 7382595500, 7382585500 నంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచించారు.


