– ఐదుగురు వ్యాపారులపై కేసు నమోదు
తిరుపతి క్రైం:తిరుపతిలోని పీపీచావడి సమీపంలో ని మటన్ మార్కెట్లో ఆరోగ్యానికి హానికరమైన మటన్ను నిల్వ ఉంచి విక్రయిస్తున్నారనే ఆరోపణలపై ఐదుగురు వ్యాపారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, పీపీచావడి మట న్ మార్కెట్లో కొందరు వ్యాపారులు ప్రజారోగ్యానికి హాని కలిగించే విధంగా నాసిరకం మటన్ను నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపా రు. ఈ ఫిర్యాదును ఆధారంగా తీసుకుని తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్లో ఐదుగురు వ్యాపారులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు వెస్ట్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ తెలిపారు.
ఉద్యోగాల పేరుతో మోసం
తిరుపతి క్రైం : తిరుపతిలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి, యువత నుంచి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితుల కథనం ప్రకారం.. తిరుపతికి చెందిన అయ్యప్ప అనే వ్యక్తి ఏఆర్ టెక్ వేవ్ కన్సల్టెన్సీ పేరుతో నిరుద్యోగులను సంప్రదించి, ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చాడు. ఈ క్రమంలో ఉద్యోగాల కోసం వచ్చిన పలువురి నుంచి డబ్బులు తీసుకుని ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ పేరుతో నకిలీ ఆఫర్ లెటర్లు అందజేశాడు. ఈ విధంగా మొత్తం 18 మంది యువకుల నుంచి సుమారు రూ.10 లక్షలు వసూలు చేసినట్లు బాధితులు పేర్కొన్నారు. అనంతరం ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో పాటు, డబ్బులు కూడా తిరిగి ఇవ్వకపోవడంతో తాము మోసపోయినట్లు గుర్తించి జిల్లా ఎస్పీని ఆశ్రయించినట్లు బాధితులు తెలిపారు. ఫిర్యాదును స్వీకరించిన జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు కేసును ఈస్ట్ డీఎస్పీ భక్తవత్సలంకు బదిలీ చేసి విచారణకు ఆదేశించినట్లు సమాచారం.


