తిరుమల:తిరుమల శ్రీవారిని ఆదివారం మేఘాలయ హైకోర్టు ప్రధాన జస్టిస్ న్యాయమూర్తి రామలింగం సుధాకర్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రావణ్కుమార్, చైన్నె లవ్ స్టోరీ మూవీ యూనిట్ సినీ నటుడు కిరణ్ అబ్బవరం, సినీ నటి శ్రీగౌరీ ప్రియ, రచయిత అనంత శ్రీరామ్, సినిమా నిర్మాత జి శ్రీనివాస్కుమార్ దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందించగా.. టీటీడీ అధికారులు ఘనంగా లడ్డూ ప్రసాదాలతో సత్కరించారు.
ముక్కంటి.. జనసంద్రం
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరస్వామి దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఆలయం భక్తజన సంద్రంగా మారింది. రికార్డు స్థాయిలో అంతరాయల దర్శన టిక్కెట్ల ద్వారా భక్తులు స్వామి అమ్మ, వార్లను దర్శించుకున్నారు. సుమారు 45వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. రూ.500 అంతరాలయ దర్శనం 434, రూ.200 శీఘ్ర దర్శనం టిక్కెట్ల ద్వారా 1,871 మంది, రూ.50 ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా 1,875 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక రూ.500 రాహు, కేతు టిక్కెట్ల ద్వారా 3,284 మంది, రూ.750 టిక్కెట్ల ద్వారా 1,446, రూ.1500 టిక్కెట్ల ద్వారా 410 మంది, రూ.2,500 టిక్కెట్ల ద్వారా 244 మంది, రూ.5 వేలు టిక్కెట్ల ద్వారా 114 మంది భక్తులు పూజలు చేయించుకున్నారు . ఇక ఐదు రకాల ప్రసాదాలు కలిపి 17,864 అమ్ముడైనట్లు ఆలయ అధికారులు తెలిపారు.


