తిరుపతి సిటీ: వైద్యవిద్యలోని పలు యూజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కీలకమైన నీటీ యూజీ రీ టెస్ట్ ఆదివారం జరగనుంది. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 9 పరీక్ష కేంద్రాల్లో 4,556 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. పరీక్షల నిర్వహణకు జిల్లా నోడల్ అధికారులు, సిటీ కోఆర్డినేటర్లు, సీసీ కెమెరాల ఏర్పాటు, తనిఖీ సిబ్బంది, పోలీసు బందోబస్తు తదితర ఏర్పాట్లపై జిల్లా అధికారులు ఇప్పటికే జిల్లాలోని పలు శాఖాధికారులతో సమావేశమై చర్చించారు. పరీక్ష కేంద్రాల్లో నిరంతర విద్యుత్, ఫ్యాన్లు, తాగునీరు, రవాణా, మెడికల్ శిబిరాలు ఏర్పాటు చేశామని, పరీక్ష కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి ఉండదని, ఒంటిపై ఎలాంటి ఆభరణాలు ధరించకూడదని సూచించారు.
అరగంట ముందే గేట్లు క్లోజ్
మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్న పరీక్షకు విద్యార్థులు అడ్మిట్ కార్డుతో ఉదయం 11 నుంచి 1.30 గంటలలోపు పరీక్ష కేంద్రాలోనికి వెళ్లాల్సి ఉంటుంది. 1.30 గంటలకు పరీక్ష కేంద్రాల గేట్లు మూసి వేయనున్నారు. ఈ లోపు పరీక్ష కేంద్రానికి చేరుకోకపోతే విద్యార్థులు పరీక్ష రాసేందుకు అనుమతి ఉండదు.
పరీక్షపై ఉన్నత స్థాయి సమీక్ష
జిల్లాలో నీట్ పునఃపరీక్ష నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ శనివారం కలెక్టర్ వెంకటేశ్వర్, అధికారులతో విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెనన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నీట్ పునఃపరీక్ష నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, జిల్లాలో 9 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. సీఐఎస్ఎఫ్తో సమన్వయం చేసుకుని పరీక్ష సజావుగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. నీట్ పునఃపరీక్ష కేంద్రాల వద్ద అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జేసీ గోవిందరావు, డీఆర్వో నరిసింహులు పాల్గొన్నారు.
నీట్ కేంద్రాలివే..
నీట్ రీ టెస్ట్కు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్
జిల్లాలో ఆదివారం జరగనున్న నీట్ రీ టెస్ట్కు అధికారులు జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఇద్దరు ఉద్యోగులను నియమించి పర్యవేక్షించనున్నారు. పరీక్షకు సంబంధించి విద్యార్థులు, తల్లిదండ్రులకు ఎటువంటి సమస్యలు ఎదురైనా కంట్రోల్ రూమ్లో సీనియర్ అసిస్టెంట్లు సుధాకర్, మహ్మద్ షరీఫ్ విధుల్లో ఉంటారని, వారిని 96662 27014, 77029 31415 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.


