తిరుపతి క్రైం : జిల్లాలో ఆదివారం నిర్వహించనున్న నీట్తో పాటు తారకరామ స్టేడియంలో జరగనున్న యోగాంధ్ర కార్యక్రమానికి పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు పోలీసు అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నీట్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సజావుగా నిర్వహించేలా అన్ని పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. అభ్యర్థులు నిర్ణీత సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని, పరీక్ష కేంద్రాల పరిసరాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే తారకరామ స్టేడియంలో నిర్వహించనున్న యోగాంధ్ర కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున, ప్రజల రాకపోకలు, వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ మళ్లింపులు, అత్యవసర సేవలు, భద్రతా ఏర్పాట్లపై సమగ్ర కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు పరస్పర సమన్వయంతో విధులు నిర్వహిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎస్పీ స్పష్టం చేశారు. సమీక్ష సమావేశంలో అదనపు ఎస్పీలు ఆర్ల శ్రీనివాసులు (పరిపాలన), రవి మనోహరాచారి (శాంతిభద్రతలు), ఐ. రామకృష్ణ (తిరుమల), ఎస్బీ డీఎస్పీ గీతా కుమారి తదితరులు పాల్గొన్నారు.


