నాయుడుపేటటౌన్: మండలంలోని జువ్వలపాళెం చెరువులో దొంగల్లా రాత్రి సమయాల్లో ఇష్టారాజ్యంగా మట్టి అక్రమంగా తవ్వి తరలిస్తున్నట్లు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజలుగా రాత్రి సమయాల్లో గుట్టు చప్పుడు కాకుండా చెరువులో జేసీబీలతో మట్టి తవ్వి, అక్రమ తరలిస్తున్న విషయాన్ని గ్రామస్తులు గుర్తించారు. జువ్వలపాళెం పంచాయతీ పరిధిలోని బిరదవాడ, మందబైలు గ్రామస్తులు గురువారం అర్ధరాత్రి అక్రమంగా మట్టి తరలిస్తున్న వారిని అడ్డుకున్నారు. దొరవారిసత్రం మండలం నెలబల్లి గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు చెరువులో మట్టి తవ్వి, అక్రమ తరలిస్తున్నట్లుగా గ్రామస్తులు గుర్తించారు. మట్టి అక్రమంగా తరలిస్తున్న వారిని నిలదీస్తే వారు అధికార పార్టీ బడాబాబుల అనుమతితోనే చెరువులో మట్టి తవ్వి తరలిస్తున్నట్లు బహాటంగా చెబుతున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. జువ్వలపాళెం చెరువులో అర్ధరాత్రి సమయాల్లో అధికార పార్టీ నాయకుల పేర్లు చెప్పి మట్టి అక్రమంగా తరలిస్తున్న విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడంతోపాటు, మంత్రి నారా లోకేష్కు ఫిర్యాదు చేయనున్నట్లు బిరదవాడ గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు పనబాక గంగాబాబు తెలిపారు. పార్టీ పటిష్టత దిగజారిపోయేలా స్థానిక అధికార పార్టీ నాయకులు చేస్తున్న అక్రమ దందాలపై పార్టీ అధి నాయకులకు సైతం ఫిర్యాదు చేస్తమని గంగాబాబు పేర్కొన్నారు. ఈ విషయమై సంబంధిత శాఖ ఉన్నతాధికారులు స్పందించి మట్టి అక్రమ తరలింపునకు అడ్డుకట్టు వేయాలని కోరారు.


