నాగలాపురం: ఎస్ఐఆర్పై అప్రమత్తంగా ఉంటూ అర్హుల ఓట్లను తొలగించకుండా బూత్ లెవల్ ఏజెంట్లు అడ్డుకోవాలని వైఎస్సార్సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం నాగలాపురంలో సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోట రాజేష్ అధ్యక్షతన వైఎస్సార్సీపీ నియోజకవర్గ బూత్ లెవల్ ఏజెంట్లకు ఎస్ఐఆర్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన భూమన మాట్లాడుతూ జాతీయ ఎన్నికల కమిషన్ చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్ (ఎస్ఐఆర్) బూత్ లెవల్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. కూటమి నేతలందరూ కలసి వైఎస్సార్సీపీ మద్దతుదారుల ఓట్లను తొలగించేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు. బీఎల్ఏలు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు నెల రోజులు పాటు కష్టపడి అర్హులు ఓట్లు, వైఎస్సార్సీపీ మద్దతుదారులు ఓట్లను తొలగించకుండా కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలసి ఓటరు జాబితా నుంచి ఓట్లు తీసివేయడానికే ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని చేపడుతున్నారని, ఇటీవల పశ్చిమ బంగా, తమిళనాడు రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ కార్యక్రమం ద్వారా అర్హుల ఓట్లను తొలగించిందని ఆయన గుర్తు చేశారు. పశ్చిమ బంగాలో సుమారు 91 లక్షల తృణమాల్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు, తమిళనాడులో డీఎంకే అనుకూలంగా ఉన్న 75 లక్షల ఓట్లు తొలగించారని చెప్పారు. ఎలాంటి సమస్యలు వచ్చినా సమన్వయకర్త దృష్టికి తేవాలని బీఎల్ఏలకు భూమన దిశానిర్దేశం చేశారు.
వైఎస్సార్సీపీ గ్రామస్థాయి నాయకులు, బీఎల్ఏలు సమన్వయంతో పనిచేసి అర్హత కలిగిన వారి ఓట్లు, పార్టీ మద్దతుదారుల ఓట్లు తొలగించకుండా చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ సత్యవేడు సమన్వయకర్త నూకతోటి రాజేష్ పిలుపునిచ్చారు. ఇతర ప్రాంతాలకు ఉపాధి కోసం వెళ్లిన వారి ఓట్లను కూడా తొలగించకుండా ఉండేలా చూడాలని, ఆ బాధ్యత పూర్తిగా బీఎల్ఏలే చూడాలన్నారు. చంద్రబాబు మళ్లీ అడ్డదారిన గెలిచేందుకు ప్రస్తుత ప్రభుత్వం అడ్డగోలు కార్యక్రమాలను తీసుకొస్తుందని, ఇలాంటి కుయుక్తులను పార్టీ శ్రేణులు సమన్వయంతో ఎదుర్కోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి బీరేంద్రవర్మ, ఎస్ఐఆర్ నియోజవర్గ ఇన్చార్జి వేలూరు రాకేష్, ఎస్ఐఆర్ టాస్క్ఫోర్స్ ఇన్చార్జి వెంకటనారాయణరెడ్డి, బూత్ కమిటీ జిల్లా అధ్యక్షుడు వెంకటేష్రెడ్డి, నియోజక వర్గ ఇన్చార్జి, నరేంద్రం సనత్ కుమార్, భాను ప్రకాష్రెడ్డి, ఏడు మండలాల మండల అధ్యక్షులు అపరంజిరాజు, గవ్వర్ల కృష్ణయ్య, చలపతి రాజు, సొరకాయలు, మనినాయుడు, దయాకర్రెడ్డి, భాస్కర్ నాయు డు నాయకులు చిన్నదొరై, అన్నాదొరై, శ్యామ్, మహేష్ రెడ్డి, ఏవీఎం బాలాజీ రెడ్డి, షాబుద్దీన్, రమేష్ రాజు తదితరులు పాల్గొన్నారు.
సమన్వయంతో పనిచేయాలి


